వారిద్దరు కవల పిల్లలు. అక్కాచెల్లెళ్లు. తిరుపతిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. సంక్రాంతి సెలవుకోసం ఇంటికి వచ్చారు. ఇంట్లో చిన్న గొడవ జరగడంతో తల్లి వారిని మందలించింది. దీంతో వారు తల్లి పై అలిగి సన్యాసం తీసుకుందామని డిసైడ్ అయిపోయారు. అందుకు తగ్గట్టుగా ప్లాన్ వేసుకొని పారిపోయారు. కానీ చివరకు పోలీసులకు చిక్కి తల్లిదండ్రుల చెంతకు చేరారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన విశ్వనాథ్ కు కవల పిల్లలు ఉన్నారు. ఆ బాలికలు తిరుపతిలోని ఓ కాలేజిలో చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు నిమిత్తం ఇంటికి వచ్చారు. ఇంట్లో ఓ విషయమై గొడవ జరగడంతో తల్లి ఇద్దరు పిల్లలను మందలించింది. దీంతో తల్లి పై వారు అలిగారు. దీంతో తండ్రి వారిని తమిళనాడులోని కాట్పాడిలో ఉంటున్న బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆయన పని నిమిత్తం బయటికి వెళ్లాడు. దీనిని అదునుగా భావించిన బాలికలు ఇద్దరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయారు. బంధువులతో పాటు తండ్రి కూడా వారి ఆచూకీ కోసం వెతికారు. కానీ దొరకలేదు. వారి సెల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశారు.
దీంతో వారి తండ్రి పలమనేరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. పిల్లలు అదృశ్యమైంది తమిళనాడు కావడంతో సీఐ శ్రీధర్ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాట్పాడి స్టేషన్ కు కేసు బదిలీ చేశారు. ఇరు రాష్ట్రాల పోలీసులు వారి ఆచూకీ కోసం వెతికారు. బుధవారం బాలికలు ఫోన్ ఆన్ చేయడంతో వారిని లోకేషన్ సిగ్నల్ ఆధారంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉన్నట్టు గుర్తించారు. బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకొని తల్లిండ్రులకు గురువారం అప్పగించారు.
పోలీసుల విచారణలో బాలికలు చెప్పిన విషయాలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. తల్లి మందలిండంతో దేశముదురు సినిమాలో హీరోయిన్ లా కాశ్మీర్ వెళ్లి సన్యాసం తీసుకుందామని అనుకున్నామని బాలికలు తెలిపారు. స్నేహితురాలు తమకు ఈ సలహా ఇచ్చిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa