ఉజ్జయినీ మహంకాళి లష్కర్ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలిబోనం, పట్టు వస్ర్తాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దంపతులు సమర్పించారు. తొలి బోనానికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో మహంకాళి అమ్మవారి ఆలయం వెలిగిపోతుంది. మహంకాళి ఆలయం దగ్గర భక్తుల సందడి నెలకొంది. బోనాల పండుగకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాల్లో 130 సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా షీటీమ్స్, టాస్క్ఫోర్స్ బృందాలు బద్రతను పర్యవేక్షిస్తున్నాయి. మహంకాళి అమ్మవారిని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కే కేశవరావు, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి నాయినీ నర్సిహారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మేయర్ బొంతురామ్మోహన్, దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తున్నారు. లక్షమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన తరువాత భక్తుల సంఖ్య బారీగా పెరిగింది. అమ్మవారి దయతో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. విజయవాడ, ఢిల్లీలో ఘనంగా బోనాల పండుగ జరుపుతున్నాం. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ కేకే మాట్లాడుతూ.. 30 ఏండ్ల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. ఎప్పుడూ ఈ స్థాయిలో ఏర్పాట్లు చూడలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారికంగా బోనాలు జరుపుకుంటున్నాం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేసిన మంత్రి తలసానిని అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa