పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పతనానికి నాంది అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ పతనం ఇక్కడినుంచే ప్రారంభమైందని చెప్పారు. 20 నెలల వైకాపా పాలనలో అన్నీ ఉల్లంఘనలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారన్న ఆయన.. అమరావతి, పోలవరం, పెట్టుబడులను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో హింసాకాండ, పెద్దఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఎంత హింస పెట్టినా.. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారని కార్యకర్తల కృషిని కొనియాడారు. ఎన్నికల్లో 38.74 శాతం ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయని చంద్రబాబు వెల్లడించారు. 94 శాతం గెలుచుకుందంటూ వైసీపీ నేతలు గాలికబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉందన్న చంద్రబాబు... అరాచకాలు చేసేవారు ఫలితాలను చూసైనా మారాలని హితవు పలికారు. పార్టీ పెడుతున్నామని షర్మిల చెబుతుంటే... ఏ2 మాత్రం లేదంటారా? అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై ఏకపక్షంగా 174 అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలే దౌర్జన్యాలు చూస్తూ... తెదేపా శ్రేణులపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదన్న చంద్రబాబు... ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa