ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడదే కీలకం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 15, 2021, 05:06 PM

ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికల్లో ఇప్పుడు సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోంది. వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పేజీల్లో ప్రచారపర్వం జోరుగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు స్మార్ట్ ఫోన్లతో స్మార్ట్ ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూనే.. స్మార్ట్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వాట్సాప్ ద్వారానే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. స్థానిక సమస్యలతో మేనిఫెస్టోలు తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. దాదాపు 80 శాతం మంది అభ్యర్థులు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ప్రచారం మొదటి రెండు విడతల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. దీంతో మూడు, నాలుగో విడత ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాను అభ్యర్థులు ఫాలో అయిపోతున్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారికి బల్క్ మేసేజ్ లు పంపేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఓటర్ల ఫోన్ నంబర్లు సేకరించి.. గ్రూప్ ఎస్ఎంఎస్ లు పంపుతున్నారు. అలాగే కామన్ డీపీలు, ప్రచారాలతో కూడిన గ్రాఫిక్ కార్డులు తయారు చేయిస్తున్నారు. ఆడియో, వీడియో సందేశాలు కూడా పంచాయతీల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వ్యాపారం కూడా జోరుగానే సాగుతోంది.
ప్రచారానికి సరైన సమయం లేకపోవడంతో అభ్యర్థులు ఈ స్మార్ట్ ఫార్ములాను అనుసరిస్తున్నారు. ఓటర్లకు గుర్తులపై సరైన అవగాహన లేకపోవడంతో వాట్సాప్, ఫేస్ బుక్ పేజీల్లోనే నమూనా బ్యాలెట్ ను షేర్ చేస్తున్నారు. వాటికి వచ్చిన లైకులు, షేర్లతో విజయవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించడంతో దాదాపు 80 శాతం మంది సొంతగ్రామాల్లోనే ఉంటున్నారు. స్మార్ట్ ఐడియాలతో వారే ఎన్నికల ప్రచారంలో ఈ మార్పులు తీసుకొచ్చారు. గ్రామాల్లోని ఆయా పార్టీల మద్దతుదారులకు సోషల్ మీడియా ప్రచారంపై అవగాహన కల్పించడం, వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా వీలైనంత త్వరగా సమాచారాన్ని షేర్ చేయడం వంటి అంశాల్లో వారే కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa