భారత్లో కరోనా ఉద్ధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయని తెలిపిన ఆయన భారత్లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయన్నారు. కరోనా తొలి ఏడాది కంటే రెండో ఏడాది 'చాలా దారుణం'గా ఉండనుందని తెలిపారు.
డబ్ల్యూహెచ్ఓ తరఫున భారత్కు కావాల్సిన సాయం అందజేస్తున్నామని అధనామ్ తెలిపారు. ఇప్పటికే వేలాది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మొబైల్ ఆసుపత్రులు, మాస్కులు సహా ఇతర వైద్య సరఫరాలను అందజేశామన్నారు. భారత్కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్న ప్రతిఒక్కరికీ ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
అయితే, ఒక్క భారత్లోనే కాకుండా నేపాల్, శ్రీలంక, వియత్నాం, కాంబోడియా, థాయ్లాండ్, ఈజిప్టు దేశాల్లోనూ కొత్త కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపారు. అలాగే ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని కొన్ని దేశాల్లోనూ కేసులు, మరణాలు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయన్నారు. గత వారంలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కొవిడ్ మరణాల్లో 40 శాతం వాటా అమెరికా దేశాల్లోనేనని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల్లో కేసుల పెరుగుదల కొనసాగుతోందన్నారు. కొవిడ్ కట్టడికి డబ్ల్యూహెచ్ఓ నుంచి కావాల్సిన సాయం ఎప్పటికప్పుడు అందజేస్తామన్నారు.
మహమ్మారి కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్తో పాటు వైద్యపరమైన జాగ్రత్తలు సైతం కొనసాగించాలన్నారు. రెండింటినీ సమన్వయపరుస్తూ ముందుకు వెళితేనే మహమ్మారిని అంతమొందించగలమని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa