ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి ఇంట ఫీవర్ సర్వే జరగాల్సిందే : జిల్లా కలెక్టర్ జె నివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 15, 2021, 12:15 PM

శ్రీకాకుళం, మే 15 :  ప్రతి ఇంట ఫీవర్ సర్వే జరగాల్సిందేనని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితులపై శనివారం అధికారులతో నిర్వహించిన టెలి  కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని పరిశీలించాలని, వారిలో కోవిడ్ లక్షణాలు ఉంటే తక్షణం గుర్తించాలని ఆయన అన్నారు. కోవిడ్ లక్షణాలు ఉంటే వాలంటీర్ యాప్ లో తక్షణం అప్లోడ్ చేయాలని, వారి నమూనాలు వెంటనే తీసుకోవాలని ఆయన ఆదేశించారు. కరోనా లక్షణాల గుర్తింపుకు మండలాల్లో సర్వే పక్కాగా జరగాల్సిందేనని కలెక్టర్ పేర్కొన్నారు. మండల స్థాయిలో ఫీవర్ సర్వే, కరోనా పరిస్థితుల నివారణ చర్యలపై మండల తహశీల్దార్లు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. తహశీల్దార్ లు మండల ఏపిడమిక్ కంట్రోల్ అధికారులుగా వ్యవహరిస్తారని ఆయన పేర్కొంటూ మండల స్థాయి సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోతే వారిపై చర్యలు చేపట్టుట అధికారం ఉందని ఆయన తెలిపారు. ప్రతి అంశాన్ని పరిశీలించాలని, ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని ఆయన పేర్కొన్నారు. కరోనా బాధితుల రవాణా అంశంలో ఎటువంటి జాప్యం జరగ రాదని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ అన్ని మండలాలకు వాహనాలను అందించామని వాటి స్థితిగతులను తెలియజేయాలని అన్నారు. ఇంకా వాహనాలు అవసరమైతే సమకూరుస్తామని అందుకు అవసరమగు ఖర్చులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న మండలాల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, సకాలంలో వైద్య సేవలు అందించుటకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. హోమ్ ఐసోలేషన్ పరిశీలన, మెడికల్ కిట్ల పంపిణీ లో జాప్యం జరగ రాదని అన్నారు.


 


        ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే.శ్రీనివాసులు, జిల్లా పరిషత్ సిఇఓ బి.లక్ష్మీపతి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తాసిల్దార్లు, వైద్య అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa