ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.

international |  Suryaa Desk  | Published : Tue, May 18, 2021, 09:36 AM

హమాస్‌ నేతలు, సొరంగాలే టార్గెట్‌గా చేసుకుని వైమానిక దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. సోమవారం గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపించింది. 15 కిలోమీటర్ల మేర హమాస్‌ సొరంగాలను ధ్వంసం చేయడంతోపాటు 9 మంది హమాస్‌ కమాండర్లకు చెందిన భవనాలను నేలకూల్చామని ఇజ్రాయెల్‌ వెల్లడించింది. హమాస్‌ తన బలగాలను, పరికరాలను ఈ సొరంగాల ద్వారానే ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తోంది. సాధారణ పౌరులెవరూ మృతి చెందినట్లు ఇప్పటివరకు గాజా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించలేదు. ఇప్పటివరకు 3,100 రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలావరకు ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ మధ్యలోనే అడ్డుకుంది.


గాజా ప్రాంతంలో విద్యుత్‌ కేంద్రానికి ఇంధన సరఫరా ఆగిపోయింది. ప్రస్తుతం రెండు మూడు రోజులకు సరిపోయే ఇంధనమేఉందని అధికారులు పేర్కొన్నారు. ఇలాగే దాడులు కొనసాగితే పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదం ఉందని గాజా మేయర్‌ యాహ్యా సరాజ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గాజా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 200 మంది పాలస్తీనియన్లు చనిపోయారని ఓ అంచనా. అయితే గాజా దాడుల్లో.. ఇజ్రాయెల్‌కు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని పాలస్తీనియా అంటోంది. అయితే ఇజ్రాయెల్ నుంచి ఎలా ప్రకటన విడుదల చేయలేదు.


 


ఇదిలావుంటే ఇజ్రాయెల్‌కు తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఆదివారం ఐరాస భద్రతా మండలి సమావేశంలో అమెరికా వ్యవహరించింది. దీంతో ఎలాంటి సంయుక్త ప్రకటన లేకుండానే సమావేశం ముగిసింది. ప్రకటనను అమెరికా అడ్డుకుందని డ్రాగన్ కంట్రీ చైనా విమర్శించింది. పరిస్థితులు సద్దుమణిగేందుకు, అమెరికా తన బాధ్యత నిర్వర్తించాలని, భద్రతా మండలికి మద్దతు ఇవ్వాలని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్‌ సమావేశ అనంతరం కోరారు.


ఇజ్రాయెల్‌ సంయమనం పాటించాలని.. దాడులు చేయడం ఆపాలని చైనా కోరింది. అగ్రరాజ్యం మాత్రం.. తాము దౌత్యమార్గాలో కాల్పుల విరమణకు కృషి చేస్తున్నామని హామి ఇచ్చింది. ఇక ఇజ్రాయెల్‌ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్‌ అల్‌ మల్కీ ఆరోపించారు. గాజాలోని సాధారణ పౌరులను మానవ కవచాలుగా వాడుకొని హమాస్‌ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్‌ ప్రతినిధి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa