ఆరు నెలల పాటు మంచుతో మూసుకుపోయి ఉండే కేదార్నాథ్ ఆలయాన్ని సోమవారం తిరిగి తెరిచినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ప్రకటించారు. కరోనా కారణంగా కేవలం కొందరు అర్చకుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరచి నిత్య పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ని ప్రార్థించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భక్తులంతా ఆన్లైన్లో దర్శనాలు చేసుకొని ఇంట్లోనే పూజలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
కరోనా దృష్ట్యా భక్తులెవరికీ బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాల్లోకి అనుమతి లేదని ప్రభుత్వం గతంలో తెలిపింది. ఈ ఏడాది చార్ధామ్ యాత్రను నిలిపేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో భక్తులంతా ఆన్లైన్లో దర్శనాలు చేసుకొనేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్స్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కేదార్నాథ్ మినహా యమునోత్రి, గంగోత్రి ఆలయాలు మే14, 15 తేదీల్లో నిత్యపూజల కోసం తెరవగా, బద్రీనాథ్ ఆలయాన్ని మంగళవారం తెరవనున్నట్లు చార్ధామ్ దేవస్థానం బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. కరోనా తగ్గిన అనంతరం భక్తులను చార్ధామ్ యాత్రకు అనుమతిస్తామని వారు తెలిపారు. మరోవైపు గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చిన్నారులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa