ఆర్బీఐ మంగళవారం బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్ట్ల వద్ద జరిగిన సీసీటీవీ రికార్డింగ్స్ను తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు నష్టపరచవద్దని సూచించింది. పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు జరిగిన 2016 నవంబర్ 8వ తేదీ నుండి డిసెంబర్ 30వ తేదీ వరకు జరిగిన సీసీటీవీ రికార్డులను అన్నింటిని భద్రపరచాలని కోరింది. నోట్ల రద్దు సమయంలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి దర్యాఫ్తు జరుగుతున్న నేపథ్యంలో, దర్యాఫ్తు సంస్థలకు సహకరించే ఉద్దేశ్యంతో ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈ సమయంలో కొత్తగా జారీ చేసిన రూ.500, రూ.2000 నోట్లు పెద్ద మొత్తంలో కొంతమంది పెద్దలకు చేరాయి. ఇది ఎలా జరిగిందనే అంశంపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ దర్యాప్తు ముగిసి కోర్టుల్లో కేసులు తేలేవరకు ఈ రికార్డులను భద్రపరచాలని ఆర్బీఐ భావిస్తోంది.ప్రధాని నరేంద్ర మోడీ 2016 నవంబర్ 8న పాత రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ ప్రకటన చేసారు. ఆ సమయంలో పాత నోట్లను తమ ఖాతాల్లో జమ చేయాలని సూచించింది. ఆ తర్వాత రూ.500, రూ.2000 నోట్లను విడుదల చేసి, వాటిని మార్చుకునే ప్రక్రియను చేపట్టింది. ఆ సమయంలో బ్యాంకు వద్ద ప్రజలు క్యూ కట్టారు. ఆ సమయంలో చాలామంది కొత్త నోట్లను అక్రమంగా సమీకరించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి దర్యాఫ్తు చేస్తున్నారు.
నోట్ల రద్దు సమయానికి రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు చలామణిలో ఉన్నాయి. నోట్ల రద్దు ముగిసే సమయానికి రూ.15.31 లక్షల కోట్ల విలువైన కరెన్సీ తిరిగి బ్యాంకుల్లో జమ అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa