కృష్ణ కరకట్ట వద్ద డ్రెడ్జింగ్ పనులను పరిశీలించేందుకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. తుళ్లూరు మండలం, తాళ్ళాయ పాలెం సమీపంలో కరకట్ట వద్ద కృష్ణా నది నుంచి డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకను డంప్ చేసేందుకు నిన్న జేపీ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వాహకులు ప్రయత్నాలు చేశారు. దీనిని అక్కడి రైతులు, స్థానికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమ గురువారం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్లి రైతులను పరామర్శించారు. కరకట్ట ప్రక్కన డంపింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తే కరకట్ట బలహీనపడుతుందని గ్రామస్తులు, రైతులు తెలిపారు. అలా చేస్తే కరకట్ట బలహీనపడి గ్రామాలు వరద ముంపుకు గురయ్యే ప్రమాదముందన్నారు. కృష్ణా నది ఒడ్డు నుంచి 500 మీటర్ల లోపల నీటిలోకి వెళ్లి డ్రెడ్జింగ్ చేపట్టాలని రైతులు అన్నారు. కాంట్రాక్టర్ తమ ఇష్టానుసారం డ్రెడ్జింగ్ పనులు చేపడుతున్నట్లు రైతులు దేవినేని ఉమకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa