ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులో మిన్నంటిన నిరసనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 02, 2017, 03:47 PM

చెన్నై: నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విద్యార్థిని అనిత(17) ఆత్మహత్య నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దాదాపు 1500 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు చెన్నైతో పాటు వివిధ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడు బోర్డు పరిధిలోని విద్యార్థులకు నీట్‌ నుంచి మినహాయింపు తెచ్చుకోవడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆందోళన వ్యక్తం చేశారు.


తమిళనాడు బోర్డు పరిధిలో విద్యనభ్యసించిన దళిత విద్యార్థిని అనిత(17) ఇటీవల నిర్వహించిన 12వ తరగతి వార్షిక పరీక్షల్లో 1200 మార్కులకు గానూ 1176 మార్కులు సాధించింది. రాష్ట్ర బోర్డు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో 196.25 మార్కులు వచ్చాయి. కానీ, నీట్‌ పరీక్షలో కేవలం 76 మార్కులే రావడంతో అందులో అర్హత సాధించలేకపోయింది. వైద్య విద్యనభ్యసించడానికి నీట్‌ తప్పని సరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమెకు మెడిసిన్‌లో సీటు రాలేదు.


నీట్‌ పరీక్ష వల్ల తనలాంటి చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారని తెలియజేస్తూ.. ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో మనస్తాపానికి గురై శుక్రవారం తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.


తమిళనాడులో దాదాపు 40 మెడికల్‌ కళాశాలలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కళాశాలల్లో సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించేది. కానీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల మెడిసిన్‌ చేయడానికి నీట్‌లో అర్హత సాధించడం అనివార్యమైంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు నీట్‌లో అర్హత సాధించడానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ తీసుకోలేక పోతుండటంతో చాలా వరకు నష్టపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa