ఒవైసీ వాహనంపై కాల్పులు జరపడం సహించరానిదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ యోగి అన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరిపిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా నిందితులు కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ కాల్పుల నుంచి ఒవైసీ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదత్యనాథ్ స్పందించారు. ఒవైసీ వాహనంపై కాల్పులు జరపడం సహించరానిదని యోగి అన్నారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఇలాంటివి ఏమాత్రం ఆమోదయోగ్యం కానివని అన్నారు. తాము బ్యాలెట్ ని మాత్రమే నమ్ముతామని, బుల్లెట్ ని కాదని చెప్పారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడానికి తమ ప్రభుత్వం అంగీకరించదని తెలిపారు. మరోవైపు ఒవైసీపై ఆయన పరోక్షంగా విమర్శలు కూడా గుప్పించారు. ఎన్నిక ప్రసంగాలలో మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా నాయకులు వ్యవహరించాలని అన్నారు. ఓటు బ్యాంకు కోసం ప్రజల విశ్వాసంతో ఆడుకోకూడదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం సీట్లను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీలకు కేవలం 20 శాతం సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. అందుకే అఖిలేశ్ యాదవ్, శివపాల్ యాదవ్ లపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం లేదని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa