ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను నాటి యూపీఏ ప్రభుత్వ సారథి కాంగ్రెస్ ప్రజాస్వామిక పద్ధతిలో చేయలేదు. సిగ్గుపడేలా రాష్ట్ర విభజన చేసింది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆంధ్రప్రదేశే ముఖ్య భూమిక పోషించింది . పార్లమెంటులో కాంగ్రెస్ అధికారం పక్షంలో కూర్చోడానికి ఏపీ అవకాశం ఇచ్చింది. అలాంటి ఏపీ విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించింది? రాష్ట్రాన్ని ఎలా విభజించారు? మైకులు ఆపేశారు. పెప్పర్ స్ప్రేలు చల్లారు. ఎలాంటి చర్చా జరపలేదు. ఈ విధానం సరైనదేనా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో కాంగ్రెస్కు కూడా రాజకీయ లబ్ధి ఏమీ జరగలేదు. ఆ పార్టీకిది ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏపీలో నాటి సీఎం ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేత ఎవరో అందరికీ తెలుసు. అలాగే గతంలో విమానాశ్రయంలో కాంగ్రెస్ సీఎం టి.అంజయ్య వైఖరి తన కుమారుడికి నచ్చలేదని ఏ ప్రధాని ఆయనను తొలగించారో కూడా సభలో చాలామందికి తెలుసు. ఏపీ విభజనకు మేము వ్యతిరేకం కాదు. కానీ విభజన చేసిన తీరు ఎలాంటిది? వాజ్పేయి ప్రభుత్వం జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను సాఫీగా ఏర్పాటు చేసింది. శాంతిపూర్వకంగా, అందరితో చర్చించి ప్రక్రియ పూర్తి చేసింది. తెలంగాణ, ఏపీ విభజన కూడా అలాగే జరిగి ఉండాల్సింది. మేం తెలంగాణకు విరోధులం కాము. అంతా కలిసి చర్చించి విభజన ప్రక్రియ చేసి ఉండాల్సిందన్నదే మా ఉద్దేశం. కానీ కాంగ్రెస్ అహంకారం, అధికారం మత్తు దేశంలో ఈ విధమైన వైషమ్యాలను పుట్టించింది. ఈ వైషమ్యాల వల్ల తెలంగాణ, ఏపీలకు నష్టం జరుగుతూనే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa