ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 01:26 PM

కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే పోరాటాలును ఉధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు కె. శ్రీనివాస్, పి. తేజేశ్వరరావు హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మరాదని, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ శనివారం శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని, ప్రభుత్వం సొంత గనులు కేటాయించకపోవడంతో స్టీల్ ప్లాంటు ముడి ఖనిజాన్ని మార్కెట్లో కొనడం వలన సంస్థపై సాలీనా రూ. 3 వేల కోట్లు అదనపు భారం పడుతున్నదని, తక్షణమే సొంతగనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలకు ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కొనసాగి స్తామని, స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకునే వరకూ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఒకే అజెండాతో ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు.


స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, స్టీల్ ఉద్యమానికి మద్దతుగా కోటి సంతకాల కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ స్టీల్ పరిరక్షణకు పోరాటం కొనసాగుతోందని అన్నారు. దేశంలోనే సముద్రతీరంలో ఉండే ఏకైక స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంటని అన్నారు. సొంత గనులు లేకపోయినా ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో రూ. 700 కోట్ల నికర లాభాలను ఆర్జించిందని అన్నారు.


కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 5, 000 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టిందని, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే 44 వేల కోట్ల రూపాయలు పన్నులు, డివిడెంట్ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించిందని అన్నారు. 22 వేల ఎకరాల్లో 33 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నదని సుమారు రూ. 2 లక్షల కోట్ల విలువగల స్టీల్ ప్లాంట్ను 100% అమ్మాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్, బ్యాంకులు, విద్యుత్, రక్షణ, రైల్వే, ఆయిల్ పరిశ్రమలతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మాలనే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa