ఓ చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను పణంగా పెట్టింది. సైనికులు పొరపాటున ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్లోని తిరప్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛాసా గ్రామస్థులు శుక్రవారం సాయంత్రం నదిలో చేపలు పట్టుకుని ఇంటికి వెళ్తుండగా ఇది జరిగిందని సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆర్మీ దిబ్రూఘర్లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు నోక్ఫ్యాయ వాంగడన్ (28), రామ్వాంగ్ వాంగ్సు (23)గా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఒకరి మోచేతికి, మరొకరికి కాలికి గాయమైన్నట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఏఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత దిహింగియా తెలిపారు. ఈ ఘటనపై స్థానిక వ్యక్తి మాట్లాడుతూ ఇద్దరి గ్రామస్థులపై సైనికులు కాల్పులు జరిపారని చెప్పాడు. వారిద్దరూ అనాథలని తెలియజేశారు. "వారిద్దరూ అనాథలు.. ఒకరి చేతికి గాయం కాగా, మరొకరి కాలికి గాయమైంది.. వారి కోసం ప్రభుత్వం ఏదైనా చేయాలి" అని కోరాడు. ఈ ఘటనపై తిరప్ జిల్లా విభాగం బీజేపీ అధ్యక్షుడు కమ్రంగ్ తెసియా కూడా స్పందించారు. స్థానికులకు భద్రత కల్పించాల్సింది పోయి, వారిపై కాల్పులు జరపడం అర్థం లేని చర్య అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పనుల వల్ల వారిపై విశ్వసనీయత దెబ్బతింటుందని అన్నారు. ఇదిలావుంటే అరుణాచల్ ప్రదేశ్లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్తో సహా మూడు జిల్లాల్లో వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కేంద్రం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. దీని ప్రకారం అనుమానం వచ్చిన వ్యక్తి వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి, వారెంట్ లేకుండా తనిఖీలు చేయడానికి కూడా భద్రతా దళాలకు అధికారం ఉంటుంది. అయితే ఈ చట్టాన్ని ఎప్పటి నుంచో స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa