కరోనా వివిధ దశలు వచ్చిన ప్రతిసారి చైనా దేశం వణికిపోతోంది. కరోనా మహమ్మారి విజృంభణతో చైనా మరోసారి ఉక్కిరిబిక్కిరవుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఆదివారం అక్కడ 13వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ ఉపవర్గం స్టెల్త్-ఒమిక్రాన్తో విలవిలలాడుతున్న చైనా.. తాజాగా మరో కొత్త వేరియంట్ను గుర్తించినట్టు తెలిపింది. షాంఘై సమీపంలోని ఓ నగరంలో ఒమిక్రాన్కు చెందిన మరో కొత్త వేరియంట్ను గుర్తించినట్టు ఈ మేరకు చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. షాంఘై సమీపంలో దలియన్ నగరానికి చెందిన ఓ వ్యక్తిలో స్వల్ప లక్షణాలు బయటపడగా.. అతడికి నిర్వహించిన పరీక్షల్లో వైరస్ పాజిటివ్గా వచ్చింది. అతడి రక్త నమూనాలకు నిర్వహించిన జన్యు విశ్లేషణ పరీక్షల్లో స్టెల్త్-ఒమిక్రాన్కు భిన్నమైన వేరియంట్ కనుగొన్నారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
చైనాలో కోవిడ్కు కారణమైన లేదా జీఐఎస్ఏఐడీ సమర్పించిన వాటితో ఇది సరిపోలడం లేదని నివేదిక తెలిపింది. శుక్రవారం ఓ వ్యక్తిలో బయటపడిన వేరియంట్ చైనాలో వ్యాప్తిలో ఉన్న మరే ఇతర వేరియంట్లతో సరిపోలడం లేదని దలియన్ మున్సిపల్ అధికారులు వుయ్చాట్లో తెలిపారు. శనివారం నమోదయిన మొత్తం కేసుల్లో దాదాపు 12 వేలు అసింప్టమాటిక్ కేసులే కావడం గమనార్హం. ఇక, కరోనాకు హాట్స్పాట్గా మారిన షాంఘైలో చైనా వైస్-ప్రీమియర్ సన్ చున్లాన్ పర్యటించారు. వీలైనంత త్వరగా కరోనాను కట్టడిచేయాలని అధికారులను ఆమె ఆదేశించినట్టు అధికారిక మీడియా జన్హు తెలిపింది.
అంతకు ముందు జిలిన్ ప్రావిన్సుల్లోనూ పర్యటించిన సన్.. కరోనా లాక్డౌన్ నిబంధనలను పరిశీలించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేలా దృఢమైన చర్యలు తీసుకోవాలని షాంఘై అధికారులను ఆదేశించారు. ఈ నగరంలోని మొత్తం రెండున్నర కోట్ల మంది ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారు. షాంఘైలో శనివారం 8 వేలు కేసులు నమోదుకాగా.. వీటిలో 7,788 అసింప్టమాటిక్ కేసులే. సోమవారం నుంచి షాంఘైలో మల్లీ మరో దశ మాస్ టెస్టింగ్ మొదలవుతుందని అధికారులు తెలిపారు. హైనన్ ప్రావిన్సుల్లోని సాన్యా నగరంలోనూ కరోనా వ్యాప్తి మొదలుకావడంతో అధికారులు ప్రజా రవాణాను నిలిపివేశారు. కేసులు పెరుగుతుండటంతో రాజధాని బీజింగ్లో పాక్షిక లాక్డౌన్లు, ప్రయాణాలపై నిషేధం కొనసాగుతోంది. ఇక, కోవిడ్-19 బారినపడ్డ పిల్లల పట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారిని తల్లిదండ్రుల నుంచి వేరుచేసి బలవంతంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతగా వేడుకున్నా అధికారులు జాలిచూపడంలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa