జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు పంజా విసిరారు. మాటు వేసి సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక జవాన్ మృతి చెందగా... మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీ నగర్లోని మైసుమాలో భద్రతా బలగాల చెక్ పాయింట్ దగ్గర సోమవారం టెర్రరిస్టులు దాడి చేశారు. తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అధికారులు అప్రమత్తమై ఘటన జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వెంటనే నిందితుల కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. అయితే ఈ ఘటనను పలు పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. "శ్రీనగర్లోని మైసుమాలో జరిగిన పిరికిపంద దాడిని నిస్సందేహంగా ఖండిస్తున్నాం. ఇందులో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం" అని నేషనల్ కాన్ఫరెన్స్ ట్వీట్ చేసింది. అలాగే అదే పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కూడా జవాన్ హత్యను ఖండించారు. " విధి నిర్వహణలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నానను, గాయపడిన జవాన్ పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. జవాన్ల హత్యను జేకే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అప్నీ పార్టీలు సైతం ఖండించాయి. ఇదిలావుండగా ఈ ఘటనకు కొన్ని గంటల ముందు పూల్వమా జిల్లాలో బీహారీ వలస కూలీలపై సోమవారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. లజోరా ప్రాంతంలో పనిచేస్తుండగా టెర్రరిస్టులు వీరిపై కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆదివారం సాయంత్రం కూడా పుల్వామాలోని నౌపొరా ప్రాంతంలో పంజాబ్కు చెందిన ఇద్దరు వలస కూలీలపైనా కాల్పులు జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa