బీజేపీ ప్రజాప్రతినిధులకు పలు చోట్ల ప్రజల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. నిలదీతలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఆగ్రహిస్తే.. అది ఏ స్థాయిలో ఉంటుందో ఎవరూ ఊహించలేం. ప్రజల కోపానికి గురైన ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదుకరైంది. గ్రామంలో అభివృద్ధి పనులు లేవు.. మౌలిక అవసరాల కల్పన లేదు. దాంతో కోపోద్రిక్తులైన ప్రజలు ఓ ఎమ్మెల్యేను బంధించారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులపై అవగాహన కల్పించేందుకు లోక్మాన్పూర్ పంచాయతీలోని ఓ గ్రామానికి చేరుకున్న బీజేపీ శాసనసభ సభ్యుడిని సింగపూర్ గ్రామస్థులు పట్టుకుని.. బంధించారు.
ఎమ్మెల్యే ఇంజనీర్ కుమార్ శైలేంద్రను రెండు గంటలపాటు ఓ పాఠశాల తరగతి గదిలో ఉంచారు. ఆ గదికి బయట నుంచి తాళం వేసేశారు. ఆ సమయంలో గ్రామస్థులు అతని ఫోన్ను కూడా లాక్కున్నట్టు సమాచారం. వరద నిర్వహణలో భాగంగా కోత పనులు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆయన్ని చుట్టుముట్టి అడగగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయితే అప్పటికే కోపం మీద ఉన్న గ్రామస్తులు అతన్ని పట్టుకుని, అభివృద్ధి పనులు ప్రారంభించే వరకు వదిలి పెట్టమని నిరాకరించారు.
ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే శైలేంద్రనే తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తన ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించారు. "సింగ్పూర్ గ్రామస్థులు నన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. వరద నిర్వహణలో భాగంగా అక్కడి పనులు ప్రారంభించనంత వరకు నన్ను వెళ్లనివ్వబోమన్నారు.." అని ఆయన పోస్ట్లో పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం.
ఆ గ్రామాల చుట్టుపక్కల కోసి నది కోతకు గురవుతుంది. కోసి పర్లోని లోక్మాన్పూర్, సింగ్కుండ్, బాలు తోలా, మరీచా, కహర్పూర్లో కోత నిరోధక పనులు జరగాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల కోతను అరికట్టేందుకు ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. దాంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు అధ్వానమైన రోడ్లు, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది లేకపోవడంపై గ్రామస్థులు కోపానికి గురయ్యారు. దాంతో ఎమ్మెల్యేని బంధించి.. డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa