ఏపీ మంత్రుల, వైసీపీ ప్రజాప్రతినిధులకు గడపగడపకు కార్యక్రమం మాత్రం ఓ సవాల్ గా మారుతోంది. ప్రజా సమస్యలపై ఎక్కడికక్కడ జనం నిలదీసే సన్నివేశాలు చోటు చేసుకొంటున్నాయి. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయనకు ప్రజల నుంచి పలు అంశాలపై ప్రశ్నలు ఎదురు అయ్యాయి. అయితే వాటికి మంత్రి అంబటి కూడా ఎదురు ప్రశ్నలు సంధిస్తూ ముందుకు సాగిపోయిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. పల్నాడు జిల్లా పరిధిలోని సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అంబటి... సోమవారం గడపగడపకులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తమ ప్రాంతంలో రోడ్లు వేయాలంటూ మంత్రిని కోరారు. ఈ ప్రశ్నకు వెనువెంటనే స్పందించిన అంబటి... టీడీపీ వారికి రోడ్లు ఎలా వేస్తామంటూ ఎదురు ప్రశ్న సంధించారు. మంత్రి పర్యటనకు సంబంధించిన వీడియోను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
అంతకుముందు అదే గ్రామంలో పలువురు మంత్రి అంబటిని నిలదీశారు. దివ్యాంగురాలిని అయిన తాను మూడేళ్లుగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నా... తనకు ఫలితం దక్కలేదని మంత్రికి తెలిపారు. అక్కడే ఉన్న అధికారులను ఆరా తీయగా.. 4 విద్యుత్ మీటర్లు ఉన్న కారణంగా ఆమెకు పింఛన్ రాలేదని అధికారులు తెలిపారు. దీంతో ఈ కారణంగానే మీకు పింఛన్ రాలేదని చెప్పి మంత్రి అక్కడి నుంచి ముందుకు కదలగా... బుల్లబ్బాయి అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా వరుసబెట్టి నిలదీతలు ఎదురుకాగా అంబటి కార్యక్రమాన్ని అప్పటికప్పుడు ముగించుకుని వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఈ విషయాలను మీడియా ప్రతినిధులు రికార్డు చేయడాన్ని గమనించిన అంబటి పీఏ... మీడియా ప్రతినిధుల ఫోన్లను తీసుకుని ఆ వీడియోలను తొలగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa