టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ చలనచిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ను గ్రాండ్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘బీజీ బ్లాక్ బస్టర్స్’ (BG Block Busters) పేరుతో నూతన నిర్మాణ సంస్థను స్థాపించి, దానికి సంబంధించిన లోగోను అధికారికంగా విడుదల చేశారు. ఇకపై ఈ బ్యానర్ ద్వారా వరుసగా భారీ చిత్రాలను నిర్మించనున్నట్లు బండ్ల గణేష్ స్పష్టం చేశారు.గతంలో కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టిన బండ్ల గణేష్.. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ స్థాపించి నిర్మాతగా మారారు. రవితేజతో ‘అంజనేయులు’, పవన్ కల్యాణ్తో ‘తీన్ మార్’ వంటి చిత్రాలు చేసినప్పటికీ.. పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆయన స్థాయిని మార్చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్తో ‘బాద్షా’, అల్లు అర్జున్తో ‘ఇద్దరమ్మాయిలతో’, రామ్ చరణ్తో ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన బండ్ల గణేష్, అక్కడ కొన్నాళ్లు బిజీగా గడిపారు. అయితే, ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ, పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మళ్లీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలనే కసితో ఆయన కొత్త బ్యానర్ను స్థాపించారు. అయితే, ఈ సంస్థలో నిర్మించబోయే తొలి చిత్రానికి సంబంధించిన హీరో, దర్శకుడు ఎవరనే వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa