ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిర్మాత దొరకడం ఎంత కష్టమో తెలుసు...

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2019, 07:44 PM

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారారు. వాణి భోజన్, అభినవ్ గోమఠం, అనసూయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. నవంబర్ 1న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు నిర్మాత విజయ్ దేవరకొండ బోలెడన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...నేను ‘పెళ్లి చూపులు’ చేసిన తరవాత.. ఈ సినిమా డైరెక్టర్, కో- డైరెక్టర్ షమీర్చ, అర్జున్ మొదటిసారి నన్ను కలిశారు. అప్పటికే వాళ్లు చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఏ మాత్రం బడ్జెట్ లేకుండా చాలా రిచ్‌గా వాటిని తీశారు. వాళ్ల స్కిల్ చూసి యాక్టర్‌గా అయినా, నిర్మాతగా అయినా ఏదో విధంగా వాళ్లతో సినిమా చేస్తానని చెప్పా. ఆ తరువాత వాళ్ళు నాకు ‘మీకు మాత్రమే చెప్తా’ స్క్రిప్ట్ చెప్పారు. నేను చేద్దాం అన్నాను. అయితే ‘అర్జున్ రెడ్డి’ సినిమా అప్పటికి రిలీజ్ కాలేదు. అది రిలీజ్ అయ్యాక ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. కానీ, ఈ సినిమా అయితే చేయాలి అనుకున్నాను. అలా చివరికి నేను నిర్మాతగా మారి తీశాను. తరుణ్ భాస్కర్ మాత్రమే న్యాయం చేయగలడు అనిపించింది. ఆయన టైమింగ్‌ చాల బాగుంటుంది. ‘పెళ్లి చూపులు’ సినిమా చేస్తున్నప్పుడు తరుణ్ సీన్స్‌లో యాక్ట్ చేసి చూపించేవాడు. నిజంగా మాకంటే బాగా చేసేవాడు. తరుణ్ అయితేనే ఈ స్క్రిప్ట్‌కి బాగుంటుందని తనని అడిగాను. అప్పుడు తను ఒప్పుకోలేదు. కానీ, చివరికి ఒప్పుకున్నాడు. ‘పెళ్లి చూపులు’ సమయంలో నిర్మాత దొరకకపోవడం ఎంత కష్టం అనేది చూశా. అందుకే సినిమాని నిర్మించా. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం ఎంతోమంది. అందుకే ఇప్పుడు నేను ఉన్న స్థానంలో ఎవరినైనా ప్రోత్సహించగలను అనే ధైర్యంతోనే ఈ సినిమా చేశా. స్క్రిప్ట్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాను గాని, ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశాక ఇక నేను ఈ సినిమాలో ఎక్కడా తలదూర్చలేదు. సెట్‌కి ఒకే ఒక్క సారి వెళ్ళాను. అది కూడా వస్తే బాగుటుంది అని అడిగితేనే వెళ్లాను. మ్యూజిక్ గురించి మాత్రమే వాళ్లు నా దగ్గరకు వచ్చేవాళ్లు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కొంచెం చూశా. కానీ, మిగిలినవాటి గురించి అసలు పట్టించుకోలేదు. ఈ టీం సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇంతగా పనిచేసే వాళ్ళను నేను నా సెట్‌లో కూడా చూడలేదు. చాలా హార్డ్‌వర్క్ చేశారు. అవుట్ ఫుట్ మీద పూర్తి నమ్మకంతో చేశారు. నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులో 70 శాతం ఈ సినిమాకే ఖర్చు పెట్టాను. మొదట్లో మా నాన్న.. ‘‘ఇప్పుడు ఎందుకురా మనకు ప్రొడక్షన్, యాక్టింగ్ మీద దృష్టి పెట్టకుండా’’ అని అన్నారు. కానీ స్క్రిప్ట్ బాగుంది అని చేసేశాం. అయితే గుడ్డిగా ఏమి చేయలేదు. ఈ టీమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే రిస్క్ తీసుకుని సినిమా చేశాను. నా మీద నమ్మకంతో నా నిర్మాతలు డబ్బు ఖర్చు పెట్టకపోతే నేను ఇప్పటికీ చిన్న ఇంట్లో రెంట్ కట్టుకుంటూ ఉండేవాడిని. అందుకే నేను చేశా. ఈ కథ విన్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. ఆడియన్స్ సినిమా హాల్ నుంచి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తారు. ఈరోజుల్లో హ్యూమర్ వర్కౌట్ అవుతుంది. సినిమా చూశాక.. సినిమాని బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాం అని ఆడియన్స్ కచ్చితంగా ఫీల్ అవుతారు. అని విజయ్ అన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa