రాజశేఖర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం కల్కి. ఆదా శర్మ, నందితా శ్వేతా నాయికలుగా నటిస్తున్నారు. అ..! చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. సోమవారం రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా కల్కి చిత్ర టీజర్ను విడుదల చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ఈ కార్యక్రమం జరిగింది. టీజర్ విడుదల అనంతరం హీరో రాజశేఖర్ మాట్లాడుతూ…గరుడ వేగ చిత్రం తర్వాత ఏ సినిమా చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆరేడు నెలలు కథ కోసం వెతికాను.
కథ కుదిరాక ప్రశాంత్ వర్మ కోసం వేచి చూశాం. గరుడ వేగ చిత్రానికి ప్రవీణ్ సత్తారుతో పనిచేస్తున్నప్పుడు ఎంత కొత్తగా అనుభూతి చెందానో…కల్కి చిత్రీకరణలో ప్రశాంత్ వర్మ అంత కొత్తగా అనిపించారు. చాలా రోజుల తర్వాత సి కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నాను. పని దొరకడమే కష్టం. అందుకే పుట్టిన రోజు కూడా చిత్రీకరణ చేస్తున్నాం. నాతో సినిమాలు చేస్తున్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. అన్నారు. నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ…విభిన్న నేపథ్యంతో సాగే చిత్రమిది. 80వ దశకంలో కథ జరుగుతుంటుంది. ఇంకా 30శాతం చిత్రీకరణ మిగిలి ఉంది. ఏప్రిల్లో వరకు షూటింగ్ అంతా పూర్తి చేసి సినిమా విడుదల చేస్తాం. అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ…నేను నా తొలి చిత్రానికి ముందే జీవిత గారిని కలిశాను. ఈ సినిమా చేద్దామని అప్పుడే నిర్ణయించుకున్నాం. చాలా రోజులు వేచి చూసి ఈ చిత్రాన్ని ప్రారంభించాం. అ..! సినిమాకు ఎంత కష్టపడ్డానో అంతకు పది రెట్లు ఈ సినిమాకు శ్రమించాను. కల్కి క్లిష్టమైన కథేమీ కాదు..అయితే పూర్తి వివరాలతో రచన చేశాం. కల్కి అనేది చాలా శక్తివంతమైన టైటిల్. నా మొదటి సినిమా చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఇది అలా కాదు. అన్నీ కుదిరితే రాజశేఖర్ గారి వచ్చే పుట్టిన రోజుకు కల్కి 2 కూడా ప్రారంభిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్, శివానీ శివాత్మిక, ఫొటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర, ఆర్ట్ డైరక్టర్ నాగేంద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa