ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రాజీవ్ రహదారి ఎలివేటెడ్, డబుల్ డెక్కర్ కారిడార్లకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుంది. కారిడార్ల నిర్మాణంలో భాగంగా ప్రైవేటు ఆస్తుల సేకరణకు హెచ్ఎండీఏ రెడీ అయింది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల సేకరణకు ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ (TDR) విధానంలో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంది.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట జంక్షన్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్కు ఇప్పటికే జైకా సంస్థ నిధులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మొత్తం రూ.2232 కోట్లతో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు మొత్తం 197.20 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇందులో 11.48 ఎకరాలు రక్షణ శాఖకు సంబంధించినది. మిగితా 83.72 ఎకరాల ప్రైవేటు స్థలాలు ఉన్నాయి.
రూ.1580 కోట్లతో డబుల్ డెక్కర్ కారిడార్ కోసం ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ చేశారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీఫాం వరకు డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 73.16 ఎకరాలు అవసరం కాగా.. ఇందులో 55.85 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించేందుకు ఇప్పటికే రక్షణశాఖ అంగీకారం తెలిపింది. మరో 8.41 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు చెందినవి ఉండటంతో సేకరణ తప్పనిసరి అయింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యుద్ధప్రాతిపదికన ఈ పనులను ప్రారంభించనున్నారు.
బుల్లెట్ రైలు కారిడార్ చూశారా.. సగం నిర్మాణం పూర్తి
ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ప్రైవేటు ఆస్తులకు పరిహారం కింద నగదు చెల్లించాలంటే రూ.వందల కోట్లు అవసరమవుతుంది. ఈ భారాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో ప్రైవేటు ఆస్తుల సేకరణలో పరిహారం కింద నగదు కంటే టీడీఆర్ను కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పరిహారం కింద నగదుకు బదులు టీడీఆర్ కేటాయిస్తారు. కోల్పోయిన భూమికి రెట్టింపు లేదా నాలుగు రెట్లు భూమిని టీడీఆర్ రూపంలో జారీ చేస్తారు. ఇందులో భూమి భౌతికంగా ఉండదు. కేవలం సర్టిఫికేట్ రూపంలో భూమి కోల్పోయిన వారికి అందిస్తారు. దీనిని ఆయా యజమానులు ఎవరైనా థర్డ్ పార్టీకి విక్రయించుకోవచ్చు.
ఉదాహరణకు సికింద్రాబాద్లో 50 గజాల ఇల్లు కోల్పోయిన నిర్వాసితుడు జీహెచ్ఎంసీ ఇచ్చే 200 గజాల టీడీఆర్ పత్రాన్ని తీసుకుని ఇతరులకు విక్రయించుకునే హక్కు పొందుతాడు. టీడీఆర్ పత్రం కలిగిన వారు, జీహెచ్ఎంసీ పరిధిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి ఇచ్చే అనుమతికి అదనంగా చేపట్టే నిర్మాణ వైశాల్యాన్ని నిబంధనలను అనుసరించి క్రమబద్ధీకరించుకోవచ్చు. ఫలితంగా లక్ష రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో.. టీడీఆర్ ద్వారా అంతకు రెట్టింపు లేదా, తనకు నచ్చిన మొత్తానికి విక్రయించుకుని లాభపడొచ్చు. ప్రస్తుతం కీలకమైన ఎలివేటెడ్, డబుల్ డెక్కర్ కారిడార్ల నిర్మాణానికి టీడీఆర్ ద్వారా ప్రైవేటు స్థలాలను సేకరించేందుకు హెచ్ఎండీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa