ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు అదనపు ఎస్పీలకు ఈనెల 6 వరకు రిమాండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2024, 07:47 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. వారిద్దరీ కస్టడీ ముగియటంతో పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరుపతన్న, భుజంగరావులను చంచల్ గూడ జైలుకు తరలించారు. ముందుగా ఈ కేసులో ఎస్‌ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావును అరెస్టు చేయగా.. అతడిచ్చిన సమాచారం మేరకు తిరుపతన్న, భుజంగరావులను అదుపులోకి తీసుకున్నారు.


ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసు విచారణలో స్పీడ్ పెంచింది. ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియస్ అంశమని మంత్రి ఉత్తమ్ ఇప్పటికే వెల్లడించారు. ఈ కేసులో చాలా మంది పెద్ద తలకాయలు జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక కస్టడీలో తిరుపతన్న, భుజంగరావుల నుంచి పోలీసులు కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు, మరో ప్రధాన నిందితుడు రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా వారిద్దరిని విచారించారు. వారు వెల్లడించిన ఆధారాలతో మరికొంతమందిని దర్యాప్తు బృందం విచారించనుంది. ఎస్‌ఐబీ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్టు తిరుపతన్న, భుజంగరావులు స్పష్టం చేసినట్లు తెలిసింది.


ఇక ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటికొస్తున్నాయి. కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా.. కాల్ రికార్డింగ్స్ ‌ఆధారంగా వసూళ్ల దందా కూడా చేపట్టినట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అంతేకాకుండా.. ఎన్నికల సమయాల్లో పోలీసుల వాహనాల్లో అధికార పార్టీ డబ్బును తరలించినట్టు కూడా తెలిసింది. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉన్న ఎన్నికల సమయంలో నేతలపై నిఘా ఉంచినట్లు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. అయితే ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉండగా.. త్వరలోనే హైదరాబాద్ రానున్నట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa