ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిప్పులు కురిపిస్తున్న భానుడు.. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 06:13 PM

తెలంగాణలో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం 7 నుంచే నిప్పులు కురిపిస్తున్నాడు. విపరీతమైన ఎండలు, తీవ్ర వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏఫ్రిల్ మెుదటి వారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా సగటున 41.5 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో శనివారం (ఏప్రిల్ 07) అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


నల్గొండ జిల్లా మునుగోడు, వేములపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ, బొమ్మలరామారం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తున్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా ఎండ తీవ్రత పెరగ్గా.. శనివారం ఉష్ణోగ్రతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా.. సాధారణం కన్నా 6.1 డిగ్రీలు అదనంగా నమోదైనట్లు చెప్పారు. 42.8 డిగ్రీల ఎండ కాస్తుండటంతో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి.


ఇదిలా ఉండగా.. మండు వేసవిలో వాతావారణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు (ఆది, సోమవారాల్లో) ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయంది. అలాగే పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణ అంతటా ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 మధ్య బయటకు వెళ్లకపోవటమే ఉత్తమమని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa