ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు కేటుగాళ్ల అమాయకులే టార్గెట్గా సైబర్ చీటింగ్ చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల మాటలను నమ్మే ప్రజలు కూడా నిలువునా మోసపోతున్నారు. తాజాగా.. హైదరాబాద్లో ఓ మహిళను మోసం చేసిన సైబర్ కేటుగాడు రూ. 60 లక్షలు కాజేసేందుకు ప్రయత్నించాడు. సత్వరమే స్పందించిన మహిళ పోలీసులను ఆశ్రయించటంతో డబ్బు డ్రా కాకుండా ఫ్రీజ్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నివసించే మహిళకు ఈ నెల 15న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకున్న సైబర్ కేటుగాడు.. మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని బెదిరించాడు. భయపడిన బాధితరాలు తాను ఏ తప్పు చేయలేదని.. కాపాడమని వేడుకుంది. ఇదే ఆసరాగా స్కైప్లో వీడియోకాల్ చేసిన సైబర్ కేటుగాడు.. ఆమెను మరింత భయపెట్టాడు. 15న రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం బ్యాంకు తెరిచే సమయం వరకు వీడియోకాల్ ఆన్లోనే ఉంచి మాట్లాడాడు. తర్వాత కేసును కొట్టేసేలా చేస్తానంటూ ఆమెను బ్యాంకుకు పంపించాడు. పలు ఖాతాలకు రూ.60 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.
డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేవరకు అతడు వీడియోకాల్లోనే ఉండటం గమనార్హం. ఆ తర్వాత కొంతసేపటికే తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసింది. దీంతో సీఎస్బీ బృందం ఆన్లైన్ లావాదేవీల వివరాలను సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో నమోదు చేయించారు. అలాగే ఎస్బీఐ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ కావడంతో ఆ బ్యాంకు ప్రతినిధులనూ అలర్ట్ చేశారు. ఈ ప్రక్రియనంతా గంటలోపే ముగించడంతో ఆయా ఖాతాల నుంచి నగదును ఎవరూ డ్రా చేయకుండా ఆపేశారు. దీంతో బాధితురాలు ఊపిరి పీల్చుకున్నారు.
సైబర్ నేరస్థులు సొమ్ము కొట్టేసినా.. వెంటనే కంప్లైంట్ చేస్తే వెనక్కి తీసుకురావొచ్చని సీఎస్బీ అధికారులు చెబుతున్నారు. పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థల ప్రతినిధులెవరూ వీడియోకాల్ లేదా స్కైప్ కాల్ చేసి డబ్బులు అడగరని చెప్పారు. అలా ఎవరైనా ఫోన్ చేస్తే.. వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa