రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. అల్లారుముద్దుగా పెంచిపెద్ద చేయటంతో పాటు పెళ్లి చేసి ఓ ఇంటికి కోడలుగా పంపిని కూతుర్ని తల్లిదండ్రులే కిరాతకంగా హత్య చేశారు. 13 నెలల పసికందుకు తల్లిని దూరం చేశారు. కూతురు మానసిక స్థితి బాగోలేకపోవటం.. ఎన్ని హాస్పిటల్స్, దేవాలయాలు తిరిగినా ఫలితం లేకపోవటంతో చివరకు కఠిన నిర్ణయం తీసుకొని చంపేశారు. ఆపై.. చేతబడి చేశారంటూ అందర్ని నమ్మించే ప్రయత్నం చేసి చివరకు పోలీసులకు చిక్కారు.
వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన చెప్యాల నర్సయ్య- ఎల్లవ్వ దంపతులు. వీరి పెద్ద కూతురు ప్రియాంక (25) గత కొన్నేళ్లుగా మానసిక వ్యాధితో బాధ పడుతుంది. చాలా ఆసుపత్రులు, దేవాలయాల వద్దకు ఆమెకు తీసుకెళ్లారు. కొంతవరకు వ్యాధి నయం కావడంతో 2020లో ప్రియాంకకు సిదిపేట జిల్లా దర్గాపల్లికి చెందిన పృథ్వీ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. ప్రస్తుతం వీరు కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రియాంక, పృథ్వీ దంపతులకు 13 నెలల కుమారుడు ఉన్నాడు.
అయితే ఇటీవల కొద్ది రోజులుగా ప్రియాంక మునుపటి లాగే మానసిక వ్యాధితో బాధపడుతుంది. అందరిని ఇబ్బంది పెట్టడటంతో పాటు చుట్టుపక్కల వారిని తిట్టడం, గొడవలు పెట్టుకోవవటం వంటివి చేస్తుంది. దీంతో భర్త పృథ్వీ ఆమె తల్లిదండ్రులకు విషయం తెలియజేశాడు. వారు బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజులు ఉంచి నయం కాకపోవడంతో ఇంటికి తీసుకొచ్చారు. కూతురు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఈనెల 14న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తాడుతో గొంతును బిగించి కిరాతకంగా హత్య చేశారు.
ఆపై ప్రియాంక చేతబడి వల్ల మరణించిందని చెప్పి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు విషయం చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రియాంక తల్లిదండ్రులను ప్రశ్నించగా.. తామే హత్యచేసినట్లు ఒప్పుకున్నారు. కూతురి మానసిక పరిస్థితి చూడలేక ఈ పని చేశామన్నారు. క్షణికావేశంలో వారు చేసిన తప్పు వల్ల తల్లిదండ్రులకు కూతురు దూరం కాగా.. ఓ పసికందుకు తల్లి దూరమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa