తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో రైల్వే లైన్ పనులు తర్వలోనే ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లైన్ మాత్రమే ఉండగా.. డబ్లింగ్ ప్రాజెక్టు గతేడాది మంజూరైంది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. దాఖలైన బిడ్లను పరిశీలిస్తున్నట్లు.. త్వరలోనే కాంట్రాక్టర్ను ఎంపిక చేయనున్నట్లు రైల్వేవర్గాలు వెల్లడిస్తున్నాయి.
బీబీనగర్-గుంటూరు రెండో ట్రైన్ లైన్ నిర్మాణానికి రూ.2,853 కోట్ల వ్యయం అవుతుందని రైల్వేశాఖ గతంలోనే అంచనా వేసింది. 293 కిలోమీటర్ల లైన్ నిర్మాణం తర్వాత రేట్ ఆఫ్ రిటర్న్ 11.02 శాతం వస్తుందని రైల్వేశాఖ రీసెర్చ్లో తేలింది. బీబీనగర్-గుంటూరు రైల్వే మార్గంలో ఇప్పటికే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్, సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్ప్రెస్ సహా విజయవాడ ఇంటర్సిటీ, గుంటూరు ఇంటర్సిటీ, శబరి, ఫలక్నుమా, నారాయణాద్రి, నర్సాపూర్, గోల్కొండ, పల్నాడు, జన్మభూమి, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి ముఖ్యమైన ట్రైన్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
డబ్లింగ్ పూర్తయితే ఈ మార్గంలో మరిన్ని ట్రైన్లు నడిపేందుకు వీలుంటుంది. ఇప్పుడు తిరుగుతున్న ట్రైన్ల వేగాన్ని పెంచడానికి అవకాశం కూడా ఉంటుంది. తద్వారా ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. ట్రైన్లను మరిన్ని స్టేషన్లలో ఆపేందుకు కూడా ఆస్కారం ఏర్పడుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత.. జూన్లో కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడుతుంది. జులై నెలలో కేంద్ర పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అందులో అధిక నిధులు కేటాయిస్తే పనుల్ని వేగంగా మొదలుపెట్టేందుకు వీలవుతుందని రైల్వే అధికారులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa