ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణికి కీలక బాధ్యత అప్పజెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 08:05 PM

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణితో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కీరవాణికి కీలక బాధ్యతను అప్పగించారు రేవంత్ రెడ్డి. ఈ భేటీలో.. "జయజయహే తెలంగాణ" పాట రచయిత అందెశ్రీ, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. "జయజయహే తెలంగాణ" పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ పాటను అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేలా రూపొందించాలని కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ పాటను కీరవాణితో పాడించే అంశంపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. దీంతో.. త్వరలోనే జయ జయహే తెలంగాణ పాట సరికొత్తగా రాష్ట్ర ప్రజలకు వినిపించే కీలక బాధ్యతను కీరవాణికి అప్పజెప్పినట్టు తెలుస్తోంది.


జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉండటంతో.. ఆ లోగా పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. అద్దంకి దయాకర్ నటిస్తున్న సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించిన బాధ్యతలు కూడా ఆయనకే ఇవ్వటం గమనార్హం.


 అయితే.. 9 డిసెంబర్ 2009 తర్వాత "జయజయహే తెలంగాణ" పాట కోట్లాది మందికి చేరువైంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత.. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినా.. అది అమలుకాకపోవటంతో.. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అయితే.. ఈ పాటను కీరవాణితో పాడించాలని చర్చలు జరుగుతుండటంతో పాట ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. మరోవైపు.. కొందరు నెటిజన్లు ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ పాటను ఆలపించేందుకు తెలంగాణకు చెందిన సంగీత దర్శకులు, గాయకులెవ్వరూ దొరకట్లేదా అని కామెంట్లు చేస్తున్నారు. వందేమాతరం శ్రీనివాస్ లాంటి సంగీత దర్శక దిగ్గజాలను మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారు.


తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ప్రతి ఒక్కరితో స్టెప్పులేయించటమే కాదు, అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకుంది. నాటు నాటు పాటకు కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa