ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఏడాదిలో మరోసారి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు.. అమెరికా సంచలన నివేదిక

international |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 11:06 PM

అమెరికాకు చెందిన ప్రముఖ విదేశీ విధానాల విశ్లేషణ సంస్థ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సీఎఫ్ఆర్) తన తాజా నివేదికలో భారత్-పాకిస్తాన్ మధ్య భద్రతా పరిస్థితులపై కీలక హెచ్చరికలు జారీ చేసింది. 2026లో భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ నివేదికలో వెల్లడించింది. 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్.. దాని అనంతరం రెండు దేశాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలు.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు, ఇరు దేశాలు చేపడుతున్న ఆయుధాల పోటీ ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని సీఎఫ్ఆర్ తెలిపింది. భారత్, పాక్ ఉద్రిక్తతలు దక్షిణ ఆసియా ప్రాంతంలో శాంతి భద్రతలకు పెను ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తోంది.


అమెరికా థింక్ ట్యాంక్ అయిన సీఎఫ్ఆర్.. తాజాగా తన కాన్‌ఫ్లిక్ట్స్‌ టు వాచ్ 2026 నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో సంచలన విషయాలను పేర్కొంది. దక్షిణాసియా అత్యంత ప్రమాదకర ప్రాంతంగా అభివర్ణిస్తూ.. 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ విశ్లేషణ ప్రధానంగా 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాలు, సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలపై ఆధారపడి ఉంది. జమ్మూ ప్రాంతంలో సుమారు 30 మంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని.. ఏదైనా ఒక చిన్న ఉగ్రదాడి జరిగినా అది రెండు అణు దేశాల మధ్య పెను ఘర్షణకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు భారీగా ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయని సీఎఫ్ఆర్ నివేదిక తెలిపింది. భారత్ ఇప్పటికే సుమారు రూ.79 వేల కోట్ల విలువైన డ్రోన్లు, క్షిపణుల కొనుగోలుకు ఆమోదం తెలపింది. అదే సమయంలో పాకిస్తాన్ తన వైమానిక రక్షణ లోపాలను సవరించుకోవడానికి చైనా, టర్కీల సాయం కోరుతోంది.


కేవలం భారత్‌తోనే కాకుండా, ఆఫ్ఘనిస్థాన్‌తో కూడా పాకిస్తాన్‌కు సరిహద్దు గొడవలు పెరగడం ఈ ప్రాంతంలో అస్థిరతకు దారితీస్తుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్‌లో రాబోయే ఎన్నికలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చొరబాట్లు ఈ యుద్ధ ప్రమాదాన్ని మరింత పెంచవచ్చని అమెరికా విదేశాంగ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa