అసోంలో భారీ ఉగ్రవాద మాడ్యూల్ బయటపడింది. బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాద సంస్థకు చెందిన 11 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భద్రతా దళాలు, నిఘా వర్గాలు ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా అసోంలో ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో అత్యంత అప్రమత్తతతో ఉన్నాయి. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని నసీమ్ ఉద్దీన్ అలియాస్ నిజాముద్దీన్ అలియాస్ తమీమ్ (24), జునాబ్ అలీ (38), అఫ్రహీమ్ హుస్సేన్ (24), మిజానౌర్ రెహ్మాన్ (46), సుల్తాన్ మెహమూద్ (40), మహ్మద్ సిద్దిఖ్ అలీ (46), రసిదుల్ అలామ్ (28), మహిబూల్ ఖాన్ (25), షారుక్ హుస్సేన్ (22), మహ్మద్ దిల్బార్ రజక్ (26), జగీర్ మియాహ్ (33)గా గుర్తించారు.
కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో ఇమామ్ మహముదార్ కాఫిలా మాడ్యుల్ (ఐఎంకే) కార్యకలాపాల గురించి అసోం పోలీసులను అప్రమత్తం చేశారు. ఐఎంకే అనేది భారత్ నిషేధించిన బంగ్లాదేశ్కు చెందిన జమాతే-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) అనుబంధ విభాగం. దీనిని 2018లో జేఎంబీ మాజీ సభ్యుడు జువెల్ మహ్మద్ అలియాస్ ఇమామ్ మహ్మద్ హబీబుల్లాహ్ అలియాస్ సొహెయిల్ ఏర్పాటుచేశాడు. ఇది ఘజ్వతుల్ హింద్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తోంది.
గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామాతో జేఎంబీ మళ్లీ చురుకుగా మారింది. హసీనా పతనం తర్వాత జైళ్ల నుంచి విడుదలైన ఉగ్రవాదులు, సీనియర్ నాయకులు అన్సరుల్లాహ్ బంగ్లా టీమ్ (ఏబీటీ), భారత్ ఉపఖండంలో అల్ ఖైదా (AQIS) భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించాలని ఐఎంకేకు దిశనిర్దేశనం చేశాయి. అసోంలో విస్తరణకు బంగ్లాదేశ్ జాతీయులు ఉమర్, ఖలీద్లను సమన్వకర్తలుగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సమన్వయం చేసుకుంటున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది.
‘పూర్వ ఆకాశ్’ అనే పేరుతో ఉన్న ఒక గ్రూప్ కమ్యూనికేషన్, రిక్రూట్మెంట్ వేదికగా పనిచేస్తోంది. ఈ నెట్వర్క్ ద్వారా అసోం, పశ్చిమ్ బెంగాల్, త్రిపురలకు చెందిన వ్యక్తులను ఉగ్రవాదం ఉచ్చులోకి లాగడం, రిక్రూట్ చేయడం, నిధుల సమీకరణ జరుగుతోంది. భారత పాస్పోర్టు ఉన్నవారు, గతంలో బంగ్లాదేశ్కు ప్రయాణించినవారు, నిషేధిత ఉగ్రవాద సంస్థల మాజీ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారు.
తనను తాను ఘజ్వతుల్ హింద్-కేంద్రీకృత తీవ్రవాద మాడ్యూల్గా ఐఎంకే ప్రొజెక్ట్ చేసుకుంటూ.. భారత్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం ఐఎంకేతో అనుసంధానమైన వేదికల ద్వారా భారత్లోని వారి నెట్వర్కులు మళ్లీ చురుకుగా మారినట్టు అధికారులు గుర్తించారు. పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలు భారత్ భద్రతకు అతిపెద్ద వ్యూహాత్మ సవాల్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa