ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌లో 165 ఏళ్ల మద్యం కంపెనీ.. 50 ఏళ్ల నిషేధం ఎత్తివేత

international |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 11:28 PM

పాకిస్తాన్‌కు చెందిన అతి పురాతనమైన, అతిపెద్ద మద్యం తయారీ సంస్థ ముర్రీ బ్రూవరీ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. సుమారు 50 ఏళ్ల నిషేధం తర్వాత.. ఇంటర్నేషనల్ మార్కెట్లోకి మద్యం ఎగుమతి చేయడానికి పాక్ ప్రభుత్వం ఆ సంస్థకు లైసెన్స్ మంజూరు చేసింది. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ .. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే మార్గాల్లో భాగంగా ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.


50 ఏళ్ల నిరీక్షణకు తెర


బ్రిటిష్ పాలనలో 1860లో స్థాపించిన ముర్రీ బ్రూవరీకి ఇది 165 ఏళ్ల నాటి చారిత్రక మైలురాయి. 1970వ దశకంలో పాకిస్తాన్‌లో ముస్లింలకు మద్యంపై నిషేధం విధించినప్పటి నుంచి ఎగుమతులపై కూడా ఆంక్షలు ఉన్నాయి. ఈ లైసెన్స్ కోసం ముర్రీ బ్రూవరీ సంస్థ యాజమాన్యం 3 తరాలుగా పోరాటం చేస్తోంది. తాజాగా షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జపాన్, బ్రిటన్, పోర్చుగల్ వంటి దేశాలకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా షిప్‌మెంట్లు పంపారు.


ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఇప్పుడు పాకిస్తాన్‌కు ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలోనే ముర్రీ బ్రూవరీ ఎగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిస్తాయని పాకిస్తాన్ నిపుణులు భావిస్తున్నారు. ఈ సంస్థ వార్షిక ఆదాయం సుమారు 100 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.900 కోట్లు ఉండగా.. ఇందులో సగానికి పైగా మద్యం అమ్మకాల ద్వారానే లభిస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


నిబంధనలు, ఆంక్షలు


ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్‌లో మద్యం వినియోగంపై కఠినమైన చట్టాలు ఉన్నాయి. దేశంలోని ముస్లింలు మద్యం సేవించడంపై నిషేధం కొనసాగుతోంది. కేవలం 90 లక్షల మంది ఉన్న ముస్లిమేతర మైనారిటీలు, విదేశీయులకు మాత్రమే లైసెన్స్ ఉన్న వైన్ షాపుల ద్వారా మద్యం కొనుగోలు చేసే అనుమతి ఉంది. ఈ పరిమితుల కారణంగా ముర్రీ బ్రూవరీకి దేశీయ మార్కెట్ తక్కువగా ఉన్నప్పటికీ.. తన నాణ్యతతో ఇప్పటికీ మనుగడ సాగిస్తోంది.


ప్రస్తుతానికి యూరప్, ఆసియా, ఆఫ్రికా మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ముర్రీ బ్రూవరీ సంస్థ తన ఎగుమతులను విస్తరించాలని చూస్తోంది. పాకిస్తాన్‌లో మద్యం ప్రకటనలు చేయడంపై నిషేధం ఉన్నందున.. ఇంటర్నేషనల్ వేదికలు తమ బ్రాండ్ గుర్తింపును పెంచుకోవడానికి మంచి అవకాశమని ముర్రీ బ్రూవరీ సంస్థ సీఈఓ ఇస్పన్యార్ భండారా తెలిపారు. రాబోయే 3, 4 ఏళ్లలో మద్యం ఎగుమతుల పరిమాణాన్ని మరింత పెంచాలని తమ కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa