ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ మంత్రుల‌కు 'ల్యాండ్ క్రూయిజర్' కార్లు.. కేసీఆర్ విజయవాడలో దాచినవే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 11, 2024, 07:54 PM

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని మంత్రులంద‌రికీ ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్ కార్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో మంత్రికి ఒక్కో ల్యాండ్ క్రూయిజర్‌ను సర్కారు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన కార్లను.. మంత్రులకు ప్రొటోకాల్ డిపార్ట్‌మెంట్ కేటాయించింది. కొత్తగా కేటాయించిన కార్లకు ఆయా మంత్రులు పూజ‌లు కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వ‌ర‌కు ముఖ్యమంత్రికి మాత్రమే ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్ ల్యాండ్ క్రూయిజర్ కార్లను స‌మ‌కూర్చుతూ వస్తోంది. కాగా.. ప్రస్తుతం మంత్రుల‌కు కూడా ల్యాండ్ క్రూయిజర్ వాహ‌నాల‌ను స‌మ‌కూర్చింది ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్. ఒకవైపు ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గిస్తామంటూనే.. మ‌రోవైపు మంత్రుల‌కు ల్యాండ్ క్రూయిజర్ కార్లను కేటాయించ‌డంపై స‌ర్వత్రా చ‌ర్చ నడుస్తోంది.


అయితే ఈ వాహనాల కొనుగోలుకు సంబంధించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు అంటూ.. ఇంత ఖరీదైన ల్యాండ్ క్రూయిజర్ కార్లను ఎలా కొనుగోలు చేస్తోందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. కాంగ్రెస్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ వాహనాలను కొత్తగా కొనుగోలు చేసినవి కాదని.. గత ప్రభుత్వ హయాంలోనే 22 వాహనాలను కొనుగోలు చేసి సంవత్సరం పాటు విజయవాడలో దాచి పెట్టిందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంది.


అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ ల్యాండ్ క్రూయిజర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం ప్రజా ధనంతో 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు తయారు చేసినట్లు తనకు తెలిసిందన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన 10 రోజుల తర్వాత ఓ చిన్న అధికారి ద్వారా విషయం తెలిసిందని రేవంత్ వ్యాఖ్యనించారు. ఒక్కోటి రూ.3 కోట్ల చొప్పున కొనుగోలు చేసి.. మెుత్తం 22 కార్లను కేసీఆర్ విజయవాడలో దాచిపెట్టినట్లు రేవంత్ వెల్లడించారు. వాటిని తమ పరివారానికి ఇచ్చేందుకు సిద్ధం చేశారని.. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారంటూ కీలక ఆరోపణలు చేశారు. అయితే.. ఇప్పుడు అవే వాహనాలను మంత్రులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా.. ఈ 22 వాహనాలకు గాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదివరకే దాదాపు 70 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఇన్ని రోజులు విజయవాడలో ఉన్న ల్యాండ్ క్రూయిజర్లు.. ఎట్టకేలకు తెలంగాణకు వచ్చాయన్నమాట






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa