నేటి సమాజంలో ఆస్తులకు ఇచ్చే విలువ అనుబంధాలకు ఇవ్వటం లేదు. రక్తసంబంధీకుల కంటే ఆస్తులే ముఖ్యమనుకుంటున్న రోజులవి. ప్రస్తుతం ఉన్న బంధాలన్నీ ఆర్థికబంధాలేనని మరోసారి నిరూపితమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి వివాదాలతో అంత్యక్రియలు నిలిచిపోవటం చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల సూర్యాపేట జిల్లాలో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను కుమారుడు అడ్డుకోగా.. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ భార్య భర్త అంత్యక్రియలను అడ్డుకుంది. ఆస్తి తగాదాలతో భర్త మృతదేహం మూడు రోజులుగా మార్చులోనే ఉండిపోయింది.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి (48) హైదరాబాద్ నగరంలో ప్రైవేటు బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట స్వగ్రామంలో 7.24 ఎకరాల భూమి ఉంది. అయితే తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని.. హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. ఇద్దరు చెల్లెళ్లతో పాటు తమ్ముడు కరుణాకర్రెడ్డితోనూ హనుమంతరెడ్డికి ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసికవేదనకు గురైన హనుమంతరెడ్డి శనివారం (జూన్ 8న) రాత్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
ఆ తర్వాత పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు చెల్లెళ్లతో పాటు తమ్ముడిపై కేసు నమోదైంది. కేసుకు భయపడ్డ హనుమంత రెడ్డి చెల్లెళ్లు, తమ్ముడు ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా స్వప్నపై ఒత్తిడి తెచ్చారు. ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే తాను కేసు విత్ డ్రా చేసుకోవటంతోపాటు అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు తేల్చి చెప్పారు.
గత రెండ్రోజులుగా ఇదే విషయమై హనమంతరెడ్డి సోదరుడు, చెల్లెళ్లతో బంధువులు చర్చించారు. కోర్టులో కేసు విత్డ్రాకు వారు ఒప్పుకొన్నా.. సోమవారం కోర్టు సమయం మించిపోవడంతో వీలు కాలేదు. ఇవాళ కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa