ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఏడు రాత్రుల్లోనే అంతా.. వెలుగులోకి సంచలన విషయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 08:05 PM

గత ప్రభుత్వ హాయంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనపై నమోదైన కేసును సిట్ విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహరం బయపడిన విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలింపులో పోలీస్ అధికారుల పాత్రపై తాజాగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారంలో ఓ ఐపీఎస్‌తోపాటు డీఎస్పీ కీలకంగా వ్యవహరించినట్టు వెల్లడయ్యింది.


అయితే, తెరవెనుక మాత్రం మరికొందరు అత్యున్నతస్థాయి అధికారులున్నట్లు సమాచారం. వారిచ్చిన ఆదేశాలతోనే ఆ ఐపీఎస్‌ నేతృత్వంలోని బృందం నగదు సరఫరాను పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పటి వరకూ ఐపీఎస్‌ అధికారి ప్రమేయంపై ఆధారాల సేకరణ వరకే సిట్‌ విచారణ పరిమితమైనట్లు భోగట్టా. మరింత లోతైన దర్యాప్తు జరిగితే ఉన్నతస్థాయి అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్‌కు లభ్యమైన ఆధారాల మేరకు.. 2022 నవంబరు 3న జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎష్ అభ్యర్థి కోసం నగదు సరఫరా చేసేందుకు ఫార్చునర్‌ వాహనం వినియోగించారు. దానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్‌ వాంగ్మూలం ఆధారంగా ఈ విషయాన్ని నిర్దారించారు.


ఆ ఐపీఎస్‌ అధికారి, స్పెషల్‌ బ్రాంచ్‌‌లో పనిచేసే డీఎస్పీ ఆదేశాలతోనే తాను ఆ వాహనానికి ఎస్కార్ట్‌గా వ్యవహరించినట్లు కానిస్టేబుల్‌ వాంగ్మూలం ఇచ్చారు. నల్గొండ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ఆయన మొత్తం కథను సిట్‌కు పూసగుచ్చినట్లు వివరించారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం తమ వాంగ్మూలాల్లో ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. మొత్తం ఏడు రోజుల పాటు రాత్రివేళలో నగదు పంపిణీ జరిగిందని తెలిపారు.


సిట్‌కు కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలంలో ‘మునుగోడు అసెంబ్లీ బైపోల్స్ సమయంలో నేను నల్గొండ టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాను.. ఐపీఎస్‌ అధికారి ఆదేశాల మేరకు డీఎస్పీ నన్ను తీసుకెళ్లారు. 2022 అక్టోబరు 26 నుంచి నవంబరు 2 వరకు వరుసగా రాత్రి వేళల్లో ఫార్చ్యూనర్ వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్లాను.. అదే వాహనంలో టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన డబ్బు తరలించారు.. అక్టోబరు 31న బహిరంగ సభలో నాటి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సభలోనే మా డీఎస్పీ ఓ ఐపీఎస్ అధికారిని నాకు చూపించారు.. ఆయన అడిషినల్ ఎస్పీ అని.. కేసీఆర్‌తో ఆ అధికారికి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు.. ఏఎస్పీ ఇచ్చిన సూచనల మేరకు మనం ఈ డబ్బును చేరవేస్తున్నామని చెప్పారు... తర్వాత ఆ అధికారి నాయిని భుజంగరావు (ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు) అని నాకు తెలిసింది’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa