తమ పిల్లలను ప్రయివేట్ స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నా.. డబ్బులు ఖర్చుచేసి మరీ ప్రయివేట్ బడుల్లో చేర్పిస్తున్నారు. కొంచెం పేరున్న స్కూళ్లకు అయితే అడ్మిషన్ల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. విద్యార్థులు లేక సర్కారీ బడులు మూతబడుతున్నాయని రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ, ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల కోసం తల్లిదండ్రులు గేట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దయచేసి మా పిల్లల్ని మీ బడిలో చేర్చుకోండని అక్కడ ఉపాధ్యాయులను బతిమిలాడుకుంటారు. ఆ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాదే కాదు గత గత తొమ్మిదేళ్ల నుంచి ఇదే జరుగుతోంది. అదే సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల.
ఈ ఏడాది 6,10 తరగతుల్లో ప్రవేశాలు ప్రారంభం కాగా.. అక్కడ మొత్తం 250 సీట్లు ఉన్నాయి. కానీ, వీటికి రెండున్నర రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 650 దరఖాస్తులు రావడంతో నో అడ్మిషన్స్ అనే బోర్డును వేలాడదీశారు టీచర్లు. విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి త్వరలో సీట్లు కేటాయించనున్నారు. గత విద్యా సంవత్సరంలో ఇక్కడ 231 మంది పదో తరగతి పరీక్ష రాస్తే కేవలం ఒక్కరే ఫెయిల్ అయ్యారు. అంటే ఏకంగా 99.3 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. అన్ని తరగతులకు కలిసి 1200 మంది విద్యార్థుల చదువుకోవడానికి అవకాశం ఉన్న ఈ స్కూల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 250 సీట్లు ఖాళీగా ఉన్నాయి
కాగా, ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రవేశాలు జరగడం శుభపరిణామమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి హైస్కూల్లోనూ అడ్మిషన్ల కోసం తీవ్ర పోటీ ఉంటుంది. పన్నాల వెంకటరాంరెడ్డి-ఇందుమణెమ్మ స్మారక ప్రభుత్వ ఉన్నత పాఠశాల (గంజ్ హైస్కూల్)లో ముందు నుంచి ఇంగ్లిష్ మీడియం బోధన కొనసాగుతోంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ తెలుగు మీడియంలోనూ బోధిస్తారు. కానీ, ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకోసం పలువురు ప్రముఖుల సిఫార్సులు లేఖలు కూడా తెస్తుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa