కువైట్లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు సజీవదహనం కాగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం కొమ్మగూడేం గ్రామానికి చెందిన కొట్టె గంగయ్య ప్రస్తుతం కువైట్లోని అదన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుర్ఘటన నుంచి టేవీ కేబుల్ వల్ల తాను ప్రాణాలతో బయటపడ్డానని అతడు చెప్పారు. ఘటన జరిగిన తీరును వివరించాడు. తెల్లవారుజామున ఘటన జరగడంతో తాను గాఢనిద్రలో ఉన్నానని, అర్తనాదాలు వినిపించడంతో మేల్కొన్నానని తెలిపాడు.
చిమ్మచీకటిలో ఏమి కనిపించలేదని, ఏం జరిగిందో తనకు అర్ధం కాలేదని గంగయ్య అన్నాడు. కానీ కాలిపోతున్న వాసన ఘూటుగా వస్తుండటంతో అగ్ని ప్రమాదం జరిగిందని అర్ధమైందని పేర్కొన్నాడు. మంటలు వ్యాపించడంతో తాను సెకెండ్ ఫ్లోర్ కిటికీల నుంచి పలువురు దూకేశారని, కానీ తాను సాహసించలేదని తెలిపాడు. చీకట్లో ఏమి కనిపించలేదని, అనుకోకుండా ఏ గోడ తగలడంతో దాన్ని ఆసరాగా చేసుకుని వస్తుంటే కింద మెట్లు తగిలాయి.. మెల్లగా కిందకు దిగి చూస్తే కొద్దిగా వెలుతురు కనిపించిందని వివరించాడు. అక్కడ నుంచి ఒక గదిలో ప్రవేశించి, అక్కడ ఉన్న టీవీ కేబుల్ సహాయంతో కొంత దూరం దిగి.. అక్కడి నుంచి పార్కింగ్ షెడ్డుపై దూకినట్లుగా గంగయ్య తెలిపాడు.
ఈ క్రమంలో తనకు స్వల్పగాయాలు అయ్యాయని, క్షత్రగాత్రులతో పాటు అదన్ ఆసుపత్రిలో చేర్పించారు అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. గంగన్నతో పాటు దుబ్బాకకు చెందిన దేవరాజం, రాజన్న, సిరిసిల్లా జిల్లాకు చెందిన ఆశోక్లు కూడా కిందకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
కాగా, కువైట్ అగ్ని ప్రమాదంలో సజీవదహనమైనవారి మృతదేహాలు శుక్రవారం ఉదయం స్వదేశానికి చేరుకున్నాయి. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో వీటిని తీసుకొచ్చారు. కువైట్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరిన విమానం.. కొచ్చికి చేరుకుంది. అక్కడ నుంచి వారి స్వస్థలాలకు అంబులెన్స్ల్లో తరలిస్తున్నారు. ఇక, మృతదేహాలను తీసుకొచ్చిన విమానంలోనే కేంద్ర మంత్రి కీర్తివర్దన్ సింగ్ వచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ అక్కడకు చేరుకుని, బాధితులను కలిశారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలను భారత్కు తరలించడానికి తక్షణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బాధితులు ఆనవాళ్లు లేనంతగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. బాధిత కుటుంబాలు సమాచారం తెలుసుకోడానికి అక్కడ భారత రాయబార కార్యాలయం అధికారులు హెల్ప్లైన్ను ఏర్పాటుచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa