పెద్దపల్లి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 6 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. అనంతరం ఆ బాలికను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ హృదయ విదారక ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అర్ధరాత్రి తల్లితో కలిసి నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లిన.. ఆ దుర్మార్గుడు.. చెట్ల చాటుకు తీసుకెళ్లి అత్యాచారం చేసి.. ఆపై హతమార్చాడు. బాలికను ఆ కామాంధుడు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో ఆ వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్లులో ఆ దారుణం చోటు చేసుకుంది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన బలరామ్ అనే డ్రైవర్.. గురువారం రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అదే రైస్ మిల్లులో ఆసిఫాబాద్ జిల్లా దాయిగాం గ్రామానికి చెందిన ఓ మహిళ పనిచేస్తోంది. ఆమె తన 6 ఏళ్ల బాలికతో నిద్రిస్తుండగా.. ఆమె పక్క నుంచి బాలికను ఎత్తుకెళ్లిన బలరామ్.. మిల్లు పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారం చేసి, అనంతరం చంపేశాడు.
అర్ధరాత్రి వేళ తన పక్కన పడుకున్న పాప లేదని గుర్తించిన తల్లి.. వెంటనే తోటి కార్మికులను నిద్రలేపి వారికి విషయం చెప్పింది. దీంతో వారంతా రైస్ మిల్లు పరిసరాల్లో గాలింపు చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ వ్యక్తి బాలికను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ క్రమంలోనే చెట్ల పొదల్లో విగత జీవిగా పడి ఉన్న బాలికను గుర్తించారు. ఆ బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. పోస్ట్ మార్టం నిర్వహించారు.
నిందితుడు అదే రైస్ మిల్లులో పనిచేసే బలరామ్గా గుర్తించారు. అతడు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని తెలుస్తోంది. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఇంతటి దారుణానికి తెగబడిన బలరామ్పై పోక్సో యాక్ట్, హత్యానేరం కింద కేసులు నమోదు చేశారు. బలరామ్తో పాటు ఈ నేరంలో మరో వ్యక్తి ఉన్నాడని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు.
బాలిక కుటుంబం 15 రోజుల కిందటే ఆ రైస్ మిల్లులో పనిచేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గత రాత్రి వర్షం కారణంగా కరెంట్ పోవడంతో, రైస్ మిల్లు ఆవరణలో నిద్రించారు. ఇది అదనుగా భావించి నిందితుడు బలరామ్ ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక బంధువులు కరీంనగర్ రహదారిపై బైఠాయించి, ఆందోళన నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa