ప్రయాణికులను ఆకర్షించేందుకు టీజీఎస్ ఆర్టీసీ రకరకాల ఆఫర్లు ప్రకటించటమే కాకుండా.. వారి సౌకర్యార్థం కొత్త కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. టీజీఎస్ ఆర్టీసీ తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంటుంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల కోసం బంపర్ ఆఫర్లు ప్రకటించటమే కాకుండా రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులను కూడా నడిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తోన్న మహాలక్ష్మి పథకంలో భాగంగా.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో.. ప్రస్తుతం 100 శాతం ఆక్యుపెన్సీతో ఆర్టీసీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. కొన్ని బస్సుల్లో అయితే.. నిలబడేందుకు కూడా ఛాన్స్ లేకుండా ప్రయాణికులు ఎక్కుతున్నారు.
దీంతో.. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో టీజీఎస్ ఆర్టీసీ కొత్త బస్సులను నడిపిస్తోంది. ఈ క్రమంలోనే.. వాతావరణ పొల్యూష్యన్ తగ్గించేందుకు గానూ.. టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఈవీ బస్సులు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మాత్రమే పరుగులు పెడుతుండగా.. వాటిని రాష్ట్రవ్యాప్తంగా నడపాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే.. హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయోగాత్మకంగా గరుడ ప్లస్ మోడల్లో 10 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నడిపింది. అది సక్సెస్ కాగా.. ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ కేటగిరీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. కొత్తగా 450 ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రానికి రానున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరో వారం తరువాత దశలవారీగా ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయని ఆర్టీసీ తెలిపింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట మధ్య ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు నడవనున్నట్టు సమాచారం. దీంతో.. పల్లె ప్రాంతాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి.
ఇప్పటికే ఆయా మార్గాల్లో కొత్త బస్సులను నడిపిస్తున్న ఆర్టీసీ.. ఈ ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని యోచిస్తోంది. అటు ప్రయాణికులకు సౌకర్యం కలగటమే కాకుండా పర్యవరణాన్ని పరిరక్షించినట్టు కూడా అవుతుందని ఈ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని ఆర్టీసీ క్రమంగా పెంచుతోంది. అయితే.. ఆ బస్సులు కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా.. పల్లె ప్రాంతాల్లో కూడా నడపాలని నిర్ణయించటంతో.. ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కాగా.. ప్రభుత్వం అమలు చేస్తోన్న ఉచిత బస్సు పథకం.. ఈ బస్సుల్లో వర్తించకపోవటంతో.. వీటిని కేవలం పురుషులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa