ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఆధీనంలోని ఆస్తుల స్వాధీనానికి రేవంత్ సర్కార్ సిద్ధం.. మంత్రి కీలక ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 07:38 PM

జూన్ 02, 2024తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి పదేళ్లు పూర్తవగా.. అప్పటితో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు కూడా పూర్తయింది. దీంతో.. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ అండ్ బీ శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకునే అంశంపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఆయా శాఖల అధికారులు కీలక ఆదేశాలు జారీ చేయగా.. ఇదే అంశంపై మంగళవారం (జులై 02న) రోజున రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఛాంబర్‌లో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.


రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉన్న లేక్ వ్యూ అథితి గృహం, మినిస్టర్స్ క్వార్టర్స్, బషీర్ బాగ్, ఆదర్శనగర్, కుందన్ బాగ్‌, గ్రీన్ ల్యాండ్స్, మంజీర అతిథి గృహాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల నివాస సముదాయాలను స్వాధీనం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీష్, ఈఎన్ సీ గణపతి రెడ్డి, సీఈ మధుసూధన్ రెడ్డి, మోహన్ నాయక్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


మరోవైపు.. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. షెడ్యూలు 9, షెడ్యూలు 10లో పేర్కొన్న మేరకు పెండింగ్‌లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల అంశాలు, ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని ఆయా శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు.


ఈ క్రమంలోనే.. పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్.. ఇప్పటి నుంచి కేవలం తెలంగాణ రాజధానిగా మారనుంది. ఈ పదేళ్లలో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలను సత్వరమే పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశించారు.


ఇదిలా ఉంటే.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అపరిష్కృత పునర్విభజన సమస్యలను పరిష్కరించుకోవటం కోసం.. ఇద్దరం కలిసి మాట్లాడుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జులై 6వ తేదీన ప్రజాభవన్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయి.. పలు అంశాలపై చర్చించుకుంటారు. కాగా.. ఇద్దరు సీఎంల భేటీపై సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఆస్తుల స్వాధీనంతో పాటు పలు ముఖ్యమైన విషయాలు కూడా చర్చించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa