తెలంగాణతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేడంతో.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రాచలం స్నానఘట్టాల దగ్గర వరద నీరు క్రమక్రమంగా పెరుగుతోంది. కరకట్ట స్లూయిజ్ల దగ్గర పరిస్థితిని పరిశీలించి పట్టణ బ్యాక్ వాటర్తో పాటు గోదావరి వరద నీరు స్లూయిజ్ల ద్వారా లీకేజీ కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీలలోకి గోదావరి వరద నీరు ముందుగా వచ్చే అవకాశం ఉండడంతో.. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 10 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలలో తలదాచుకునే ప్రజలకు అన్ని వసతులు ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాలతో పాటు.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మరింతగా వరద పెరిగే అవకాశాలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఇంకా పెరిగి.. గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే.. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ కూనవరం చింతూరు వి.అర్.పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోనున్నాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. ఈరోజు మొత్తంగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
అయితే.. 1986 సంవత్సరంలో చరిత్రలోనే గరిష్ఠంగా గోదావరికి 75.60 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రికార్డు. 2022లో కురిసిన భారీ వర్షాలకు 71.30 అడుగులకు నీటిమట్టం పెరిగింది. 1990లో 70.3 అడుగులకు, 2006లో 66.9 అడుగులకు, 1976లో 63.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చేరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa