ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీధి కుక్కల దాడిపై ,,,, ప్లకార్డులతో చిన్నారుల నిరసన, పీఎస్‌లో కంప్లైంట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2024, 09:40 PM

తెలంగాణలో వీధి కుక్కల దాడులు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ దాడుల్లో కొందరు చిన్నారులు ప్రాణాలు ప్రాణాలు కోల్పోతుండటం విషాదకరం. ఎన్ని దాడులు జరిగినా.. ఎంత మంది ఈ దాడుల బారిన పడినా.. అధికారులు శాశ్వత పరిష్కారాలు కనుక్కోకుండా.. ఆ సమయానికి మమా అనిపిస్తుండటం తీవ్ర విమర్షలకు దారి తీస్తోంది. అయితే.. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. పలువురు చిన్నారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.


వీధి కుక్కల బారి నుంచి తమను కాపాడలంటూ కొంత మంది చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్‌‌పై ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్లోని పలు కాలనీలకు సంబంధించిన చిన్నారులు కాగా.. "రేవంత్ అంకుల్.. మా ప్రాణాలకు భరోసా ఏది.." అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. స్కూల్‌కు వెళ్లే సమయంలో.. తిరిగి వచ్చే సమయంలో రోడ్డు వెంట చాలా కుక్కలు ఉంటున్నాయని.. పిల్లలు తెలిపారు. అందులో కొంత మందిని కుక్కలు కరిచాయని.. పిల్లలతో పాటు పెద్దవాళ్లపై కూడా దాడులు చేసాయని వివరించారు. కుక్కల నుంచి తమను కాపాడాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తులు చేశారు చిన్నారులు.


జంట నగరాలలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. చిన్నారులను బయటికి పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. అంతేందుకు కొన్ని ప్రాంతాల్లో పెద్దవాళ్లు కూడా ఒంటరిగా వెళ్లాలంటే జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంపల్లి మున్సిపాలిటీలోని ఎన్సీఎల్ కాలనీలో 2 రోజుల్లో ముగ్గురు పిల్లలతో పాటు ఒక పెద్దమనిషిపై కూడా వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినా.. మున్సిపల్ అధికారులలో ఏమాత్రం చలనం లేకపోవటం శోచనీయం.


ఈ క్రమంలోనే.. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. వీధి కుక్కల నుంచి కాపాడండి అంటూ తల్లిదండ్రులతో కలిసి చిన్నారులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, ఎమ్మెల్యే వివేక్ అంకుల్.. అంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. స్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు.. సంబంధిత అధికారులను సంప్రదించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.


కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కుక్కల బెడద ఉంది. బుధవారం రోజున.. హుజురాబాద్లో దాదాపు 29 మందిపై కుక్కలు దాడిచేయటం పరిస్థితి అద్దం పడుతోంది. ఇటీవల ఘట్కేసర్ ప్రాంతంలో కూడా ఓ కుక్క 14 ఏళ్ల బాలుడిని వెంటాడింది. సంగారెడ్డిలోనూ ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి.


ఇదిలా ఉంటే.. వీధి కుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు సైతం ప్రభుత్వం మీద సీరియస్‌ అయ్యింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు.. పరిష్కార మార్గాలను హైకోర్టు అన్వేషించాలని సూచించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa