తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సోమవారం (జూలై 22) ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిశారు. మూసీ మురికి నీటి శుద్ధి పనులకు రూ. 4,000 కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను నింపే పనుల కోసం రూ. 6,000 కోట్లు ఇవ్వాలని కోరారు.
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆవశ్యతను కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాలుష్యం బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం తలపెట్టిన బృహత్తర ప్రణాళిక గురించి వివరించారు. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించిన రెండు జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. జాతీయ స్థాయిలో జల్ జీవన్ మిషన్ 2019లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంతవరకు నిధులు కేటాయించలేదని కేంద్ర మంత్రికి గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. ఈ ఏడాది నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని ఇందుకోసం పీఎంఏవై (అర్బన్ & రూరల్) కింద చేపట్టే నల్లా కనెక్షన్ల కోసం రూ. 16.100 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని రేవంత్ రెడ్డి బృందం కలిసింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ. 1468.94 కోట్ల రాయితీని పెండింగ్లో పెట్టారని కేంద్ర మంత్రికి వివరించి, సంబంధిత పత్రాలను కేంద్రానికి సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరించుకొని అందుకు సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అదేవిధంగా 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్ఎఫ్ఎస్ఎ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు విడుదల చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa