ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గృహజ్యోతికి దరఖాస్తు ఇక నిరంతర ప్రక్రియ ,,,, డిప్యూటీ సీఎం భట్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 07:58 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న గృహజ్యోతి పథకం లో భాగంగా ప్రజలకు 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ అందించాలని రేవంత్ రెడ్డి సర్కారు భావించగా.. అర్హత ఉండి కూడా కొందరిని ఈ పథకం అమలు కావట్లేదు. అయితే.. గతంలో ప్రజాపాలన పెట్టి.. ఆరు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అందులోనే ఈ గృహజ్యోతికి కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే.. వాటి ఆధారంగా కొందరికి పథకం అమలవుతుండగా.. మరికొందరికి అమలు కావట్లేదు. దరఖాస్తు పెట్టుకున్న అమలు కాని వారికి, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారందరికీ కలిపి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపికబురు చెప్పారు.


అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో మాట్లాడిన భట్టి విక్రమార్క.. గృహాజ్యోతి పథకంపై ప్రసంగించారు. అర్హత కలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంత ప్రజలు.. సమీప మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవాళ్లు డివిజన్ ఆఫీసుల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమమని.. దరఖాస్తు చేసుకోని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ను ఏ కుటుంబం వాడుకున్నా.. వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు.


గృహా జ్యోతి పథకం లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయలేదని.. గ్రామ సభలు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించామని భట్టి విక్రమార్క తెలిపారు. అలా వచ్చిన దరఖాస్తులను వడబోసి అర్హత కలిగిన వారందరికీ జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టత ఇచ్చారు.


మరోవైపు.. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని పూర్తి క్లారిటీ ఇచ్చారు. కాగా.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డిస్కంలను ప్రైవేటీకరణ చేయొద్దని.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. డిస్కంలలో ఏం జరుగుతుందో ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలుసుకోవాలని.. కరెంట్ బిల్లు కలెక్షన్లకు వెళ్తే అదానీ మనుషులు వచ్చారని గొడవలు అయ్యోయో లేదో తెలుసుకోవాలని సూచించారు.


అదానీ మనుషులు వచ్చారంటూ పాతబస్తీలో గొడవలు జరిగినట్టుగా ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో లేదో తెలుసుకోవాలని భట్టికి కేటీఆర్ సూచించారు. పాత బస్తీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి వారి భయాలు తొలగించాలని కోరారు. ఈ క్రమంలోనే కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. హైదరాబాద్‌లో పవర్ సర్కిళ్లను ప్రైవేటువాళ్లకు ఇస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరో పత్రికల్లో రాసినదాన్ని పట్టుకుని సభలో మాట్లాడితే ఎలా అని భట్టి ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa