తెలంగాణకు నిధులు కేటాయించకపోవటంపై నరేంద్ర మోదీ సర్కారుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తి పోస్తుండగా.. అసలు ఏపీకి 15 వేల కోట్ల నిధులు కేటాయింపు వెనుక ఉన్న లాజిక్ను బీజేపీ శాసనసభపక్ష నేతల ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివరించారు. తెలంగాణ ఎడారి కావొద్దని ఏపీకి రూ. 15 వేల కోట్లు కేటాయించినట్టు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా కేవలం 15 వేల కోట్లే ఇచ్చారని.. ఒక వేళ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చుంటే తెలంగాణ పూర్తిగా ఎడారి అయ్యేదని చెప్పుకొచ్చారు మహేశ్వర్ రెడ్డి. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే.. తెలంగాణలో ఉన్న పరిశ్రమలన్ని.. ఆంధ్రప్రదేశ్కే వెళ్లిపోయేవని.. అప్పుడు పరిస్థితి దయనీయాంగా మారేదని చెప్పుకొచ్చారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రజలు పాలాభిషేకం చెయ్యాలని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం మంచి నీటి కోసం "అమృత్" అని 3500 కోట్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రాత్రికి రాత్రే పంచుకున్నారంటూ కీలక ఆరోపణలు చేశారు. మూసీ నదిని అడ్డం పెట్టుకుని లక్షా 50 వేల కోట్లు ఏటీఎం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటూ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
అంతేకాకుండా.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీజేపీకి బానిసల్లా పని చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను భారతమాత, దేశ ప్రజలకు మాత్రమే బానిసలమనన్న మహేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ నాయకులే రాహుల్ గాంధీకి బానిసలై ఇలా మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్రానికి ఏ రాష్ట్రం మీద వివక్ష ఉండదని వివరించారు.
నియమాలు, నిబంధనలు తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని వంచించారని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇస్తామని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. బయ్యారంలో లభ్యమయ్యే ముడిసరుకు థర్డ్ గ్రేడ్ అని నివేదిక వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని అంటున్నారని.. మూసీ నది సుందరీకరణకు సంబంధించిన డీపీఆర్ కేంద్రానికి మీరు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా.. కేంద్రంపై విమర్శలు చేయటం మానేసి.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కలిసి సభలో తమను మాట్లాడనివ్వడం లేదని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa