ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్ట్.. ఆ భూములపై స్పెషల్ ఫోకస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 09:46 PM

తెలంగాణ సూపర్ గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాగా.. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సర్కారు చక చకా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. ఆయా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ  కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ 2వ వారంలోగా పూర్తి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను శాంతి కుమారి ఆదేశించారు.


రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం (ఆగస్టు 13న) సచివాలయంలో సీఎస్ శాంతి కుమారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శాంతి కుమారి.. ప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు రాష్ట్రంలోనే ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సబంధించి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. భూసేకరణ పరిహారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


మరోవైపు.. భూములు కోల్పోతున్న రైతులకు సరైన పరిహారం అందేలా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. భూముల మార్కెట్ విలువ ఆధారంగా రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టు కేసులపై కూడా ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. సమీక్షకు రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్ రాజు, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవిన్ మిట్టల్, అటవీశాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్ది, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.


ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రీజినల్ రింగు రోడ్డుపై కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన నితిన్ గడ్కరీ.. తెలంగాణ సర్కార్ భూసేకరణ చేసి ఇచ్చిన తర్వాతే రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టూ.. రూ.17 వేల కోట్లతో రింగు రోడ్డు మంజూరు చేసినట్టుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణపై వేగం పెంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa