పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. సుమారు 36 వేల కోట్లకు పైగా పెట్టుబడులు, 31 వేల ఉద్యోగాలు రానున్నట్టు సీఎంవో ప్రకటించింది. అయితే.. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలో పలు కంపెనీలతో చర్యలు జరిపిన బృందం.. సీఎం రేవంత్ రెడ్డి సోదరునికి సంబంధించిన సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. "స్వచ్ఛ్ బయో" సంస్థ.. హైదరాబాద్లో 1000 కోట్ల పెట్టుబుడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుందని వార్తలు వచ్చాయి. దీంతో.. రేవంత్ రెడ్డి పర్యటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా.. ఈ స్వచ్ఛ్ బయో సంస్థతో ఒప్పందం విషయంపై మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు.
స్వచ్ఛ్ బయో కంపెనీకి ప్రయోజనం కల్పించే ఎలాంటి హామీని తాము ఇవ్వలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. తాము సంతకం చేసింది.. కేవలం జెనరిక్ ఎంవోయూ మాత్రమేనని అసలు విషయం చెప్పేశారు. శనివారం రోజున సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ క్రమంలోనే.. స్వచ్ఛ్ బయో సంస్థ గురించి మాట్లాటిన మంత్రి.. ఆ సంస్థ ఇటీవల ఏర్పడి ఉండొచ్చు కానీ అది సుగనిత్ రెన్యూవబుల్స్తో అధికారిక భాగస్వామ్యంలోకి ప్రవేశించిందని తెలిపారు. అయితే.. 9 రోజుల తమ విదేశీ పర్యటన విజయవంతమైందని.. 25 కంపెనీలతో 36 వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని మంత్రి పేర్కొన్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ బృందంతో స్వచ్ఛ్ బయో కంపెనీ ఛైర్ పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు. బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ అయిన స్వచ్ఛ్ బయో.. తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడిందని.. త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్ నెలకొల్పనుందని తెలిపారు. మొదటి దశలో దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు. అయితే.. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని కూడా తెలిపారు.
మరోవైపు.. స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగనిత్ బయో రెన్యువబుల్స్ కంపెనీ బయోమాస్, సెల్యులోజ్ నుంచి జీవ ఇంధనాలు,జీవ రసాయనాలను ఉత్పత్తి చేసే పేటేంట్ పొందటంతో పాటు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసిందని తెలిపారు. ఈ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రంలో సుస్థిరమైన, పర్యావరణ అనుకూలమైన వృద్ధికి దోహదపడనుందని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ వికేంద్రీకృత అభివృద్ధి దృక్పథం తమను ఆకట్టుకుందని కంపెనీ ఛైర్మన్ ప్రవీణ్ పరిపాటి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవటం తమకు ఆనందంగా ఉందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బయో ఫ్యూయల్స్ హబ్గా మార్చాలనే తమ ఆలోచనలను అధికారులతో పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa