ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ములుగు ఫారెస్ట్‌లో కూలిన 50 వేల చెట్లు,,,సుడిగాలి బీభత్సం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 07:26 PM

ములుగు జిల్లా ఏటూరు నాగరం ఫారెస్ట్‌లో బలమైన ఈదురు గాలులు విధ్వంసం సృష్టించాయి. 'టోర్నడో' తరహా బలమైన గాలులతో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలోన చెట్లు నేలకొరిగాయి. మెుత్తం 50 వేలకు పైగా చెట్లు విరిగిపడ్డాయి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా గాలులు విరుచుకుపడి.. చెట్లు నేలకూలటం పట్ల అటవీ శాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31 సాయంత్రం 5:30 – 7:30 గంటల మధ్య రెండు గంటల వ్యవధిలోనే ఈ విధ్వంసం జరిగింది. ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు సుమారుగా 15 కి.మీ వ్యవధిలో దాదాపు 500 ఎకరాల్లో 50 వేల చెట్లు నేలకూలాయి. ఈ విధ్వంసంలో అడవిలోని అరుదైన ఎగిస, జువ్వి, నారెప, నల్లమద్ది, తెల్లమద్ది, మారేడు, నేరేడు, ఇప్ప వంటి మిశ్రమ జాతుల చెట్లు కుప్పకూలిపోయాయి.


జరిగిన విధ్వంసంపై జిల్లాకు చెందిన మంత్రి సీత‌క్క ఆరా తీశారు. జిల్లా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇన్ని వేల చెట్లు నేలకొరగటంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. గతంలో తానెన్నడూ ఇటువంటి విధ్వంసం చూడలేదని అన్నారు. సుడిగాలుల వల్ల వేల చెట్లు నేలకొరగటంపై విచారణకు ఆదేశించామన్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయిస్తున్నామని చెప్పారు.


వనదేవతలు సమ్మక్క-సారక్కల దయవల్లనే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని మంత్రి సీతక్క అన్నారు. ఈ గాలి విధ్వంసం గ్రామాల్లో జరిగి ఉంటే భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదని అన్నారు. అమ్మ దయ వల్లే ప్రమాదం తప్పిందని చెప్పారు. ఆ తల్లుల దీవెనతోనే ప్రజలు సురక్షితంగా బయట పడగలిగారని అన్నారు. ఈ ఘటనపై కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్రం నుంచి ప‌రిశోధ‌న టీంలు రప్పించి కార‌ణాలు గుర్తించాలన్నారు. అట‌వీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


ఇక పెను విధ్వసంతో చెట్లు నేలకొరగటంపై అటవీ శాఖ అధికారులు ఇప్పటికే విచారణ మెుదలు పెట్టారు. గాలులు వీచిన విధానంపై.. జరిగిన విధ్వంసంపై వారు సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సహకారంతో విధ్వంసానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. త్వరలోనే ఈదురు గాలులు చోటు చేసుకోవటానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa