ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద బాధితులకు సాయం పెంపు.. ఎంతిస్తారంటే..?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 07:52 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలు అతాలకుతలం అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మెుత్తం 29 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలగా ప్రకటించారు. భారీ వరదలతో చాలా ప్రాంతాల్లో ఇళ్లు, వాకిలి కొట్టుకుపోయాయి. పశువులు, పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. దీంతో వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లు, పశువులకు ఒక్కోదానికి రూ.50 వేలు, మేకలు, గొర్రెలకు రూ.5 వేలు, పంట నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10 అందిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.


ఇక వరదల వల్ల పూర్తిగా నిరాశ్రయులుగా మారిన వారికి తక్షిణ సాయం కింద రూ. 10 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ పరిహారం పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్‌ రెడ్డి, ఉన్నతాధికారుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి రూ.10 వేల ఆర్థిక సాయం సరిపోదని వారికి ఉదారంగా సాయం ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వరదల్లో మునిగిన ఇంటి మరమ్మతుల కోసం రూ.6,500, కొత్త బట్టల కోసం రూ.2,500, ఇంటి యజమానికి 30 రోజుల పనిదినాలకు రోజుకు రూ.200 చొప్పున రూ.6 వేలు, బురదలో కూరుకుపోయిన వస్తువుల కోసం రూ.2,500 కలిపి మెుత్తంగా ప్రతి ఇంటికి రూ.17,500 సాయంగా అందించాలని నిర్ణయించినట్లు సమాచారం.


వరదల్లో పూర్తిగా మునిగి వరిపంట దెబ్బతిన్న రైతులకు ఎకరానికి రూ.12 వేలు, వరి కాకుండా ఇతర పంటలకు ఎకరానికి రూ.10 వేలు సాయం చేసేందుకు సిద్ధమయ్యారు. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని సీఎం రేవంత్ అధికారులను సూచించినట్లు తెలిసింది. అయితే వరద సాయం పెంపుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా, గత వారం కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 117 గ్రామాల్లో ఇళ్లకు, పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ప్రతి ఇంటికి, పంటకు ఎంత నష్టం వాటిల్లిందనే పూర్తి వివరాలను క్షేత్రస్తాయిలో అధికారులు సేకరించారు. ఈ నివేదికను సాయం కేంద్రం కేంద్రానికి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa