ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కదలివచ్చిన మానవత్వం.. ఇన్‌స్టా వీడియోతో చిన్నారులకు పెద్ద సాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 07:49 PM

పుట్టిన రెండు వారాల్లోనే తల్లిని కోల్పోయిన ఓ చిన్నారుల దయనీయ పరిస్థితి చూసి ఓ యువకుడు చలించిపోయాడు. వారి కన్నీటి గాథను నలుగురికీ తెలిసేలా చేస్తే.. ఎంతో కొంత సాయం అందుతుందని భావించాడు. పిల్లల దుస్థితి గురించి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పలువుర్న కదిలించింది. మానవత్వంతో స్పందించిన దాతలు రూ.21 లక్షల అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది.


చిన్నారుల బంధువుల బేతమల్ల రవి తెలిపిన వివరాలివీ... బొజ్జన్నపేట గ్రామానికి చెందిన ఉమ (24), నరేశ్ దంపతులు. వీరికి రెండున్నర సంవత్సరాల పాప నిత్విత ఉంది. రెండోసారి గర్బం దాల్చిన ఉమ ఆగస్టు 10న ఓ బాబుకు జన్మనిచ్చింది. కానీ, ఆ చిన్నారి జన్మించిన 18 రోజులకే ఆగస్టు 28న తల్లి ఉమ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందింది. నరేశ్ ర్థిక స్తోమత అంతంతే కావడంతో పిల్లలను తాత, నానమ్మ, పెదనాన్నలు సాకుతున్నారు. కూలి పనులు చేసుకుంటూ పూరి పాకల్లో జీవనం గడుపుతున్నారు.


ఈ క్రమంలో కురవి మండలానికి చెందిన గంగరబోయిన రఘు అనే ఓ యువకుడు.. ఇన్‌స్టా రీల్స్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలో అతడికి ఫోలోవర్లు ఎక్కువ. అయితే, నిరుపేద అయిన తండ్రి, లోకం తెలియని ఆ పిల్లల పరిస్థితిని తెలుసుకుని రవి చలించిపోయాడు. వారికోసం ఏదైనా చేయాలని ముఖ్యంగా బాలిక నిత్విత భవిష్యత్‌ కోసం ఏదైనా సాయం చేయాలని అతడు భావించాడు. వారి దైన్యాన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేయడంతో అనూహ్య స్పందన వచ్చింది. తమకు తోచినంత సాయం చేశారు. లక్ష మందికిపైగా దాతలు రూ.1 మొదలుకొని రూ.10 వేల వరకు ఇచ్చి రూ.21 లక్షలు అందించి... మానవత్వం చాటుకున్నారు.


ఈ మొత్తంలో రూ.లక్షకుపైగా చిన్నారుల తల్లి ఉమ అంత్యక్రియలు, దశదినకర్మకు, ఇతర అవసరాల కోసం ఖర్చయిపోయింది. మరో రూ.3 లక్షలు చిన్నారుల ప్రస్తుత అవసరాల కోసం దాచిపెట్టారు. మిగిలిన రూ.17 లక్షలను నిత్విత పేరిట బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఆమెకు 22 ఏళ్ల వయసు వచ్చే నాటికి రూ.80 లక్షలు అయ్యేలా మహబూబాబాద్‌లోని ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్టు రఘు తెలిపారు. ఈ బాండ్‌ను మహబూబాబాద్‌లో ఎస్బీఐ మేనేజర్‌ సునీల్‌కుమార్‌ నిత్విత కుటుంబ సభ్యుల సమక్షంలో యువకుడు రఘుకు గురువారం అందజేశారు. ఈ బాండ్‌ను త్వరలో జిల్లా అధికారుల చేతుల మీదగా చిన్నారుల కుటుంబసభ్యులకు అందజేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa